KCR నేషనల్ పాలిటిక్స్.. నార్త్ నమ్మేదెలా!

by Disha Web Desk 4 |
KCR నేషనల్ పాలిటిక్స్.. నార్త్ నమ్మేదెలా!
X

దిశ, వెబ్ డెస్క్: దసరా పండుగకి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. ఇటీవల టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ ఎన్నికల సంఘం కేసీఆర్‌కు లేఖ రాసింది. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఇటీవల ఆవిష్కరించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి సీఎం పయనమయ్యారు. ఇలా బీఆర్ఎస్ పనులు చకచకా సాగుతున్నాయి. కానీ అసలు నార్త్ ప్రజలు సౌత్ లీడర్‌ని అంగీకరిస్తారా అనేది అసలు సమస్య.

ఇదే కేసీఆర్‌కు ప్రధాన సవాలు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో తెలుగు వారున్న చోట్ల తొలుత పార్టీని పటిష్టం చేసేలా కేసీఆర్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే కర్ణాటకలో పలు చోట్ల పోటీ చేసి కుమారస్వామిని ఈ దఫా సీఎం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మహారాష్ట్రలో కొన్ని గ్రామాలు తమను తెలంగాణలో చేర్చాలని కోరుతున్న నేపథ్యంలో అక్కడ ఫోకస్ పెంచాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. సెక్యులర్ రాష్ట్రాలే లక్ష్యంగా పావులు కదిపేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.గతంలో జాతీయ రాజకీయాల్లో అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు హస్తినా పురానికి వెళ్లిన తెలుగు నేతలు వివిధ కారణాలతో మళ్లీ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమయ్యారు.

బీజేపీ వరుస విజయాలు, ఎత్తుగడలను కేసీఆర్ ఏమేరకు ఛేదించగలరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మోడీ- అమిత్ షా ద్వయం 2014 నుంచి కేంద్రంలో బీజేపీని పతాక స్థాయికి చేర్చాయి. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇతర రాష్ట్రాల్లో పోటీచేస్తే అక్కడి ప్రజలు బీఆర్ఎస్‌ను విశ్వసించాలంటే నేటివిటీకి దగ్గరగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. జాతీయ పార్టీగా అవతరించేందుకు కేసీఆర్ ఓట్ల శాతంపై దృష్టి సారించారని, తద్వారా ఇతర రాష్ట్రాల నేతలు తమను గుర్తిస్తారని కేసీఆర్ ప్లాన్ అని తెలిసింది.

ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు..

ఇదే కోవలో మొదటి వరుసలో ఎన్టీఆర్ ఉంటారు. 1989లో నేషనల్ రాజీవ్ గాంధీని ఓడించేందుకు నేషనల్ ఫ్రంట్‌లో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు సైతం జాతీయ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. 1996 లోక్ సభ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు పెద్ద సంఖ్యలో సీట్లు రాగా ఆ ఎన్నికలలో కేంద్రంలో ప్రధాన మంత్రులను నిర్ణయించే కింగ్ మేకర్ గా చంద్రబాబు వ్యవహరించాడు. కాంగ్రేసేతర పార్టీలను కూడగట్టడం, కేంద్రంలో ప్రభుత్వాలను ఏర్పర్చడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి కేంద్రంలో మొదటిసారి కాంగ్రెస్, బీజేపీ లేని తృతీయ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేశాడు. దీనికి బయట నుంచి మద్దతు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీని ఓడించాడు.

ఇందులో భాగంగా దేవేగౌడ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత దేవెగౌడను మార్చాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో తుదుపరి ప్రధానిగా ఐకే గుజ్రాల్ ఎంపికయ్యారు. ఈ నిర్ణయంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ఈ రెండు సందర్భాల్లో వామపక్షాలు, ఇతర ప్రాంతీయ పార్టీలను ఐక్యంగా ఉంచడానికి జాతీయ కన్వీనర్ గా చంద్రబాబు శ్రమించాడు. ఈ రెండు సార్లు చంద్రబాబును ప్రధాని చేయాలని ఆయా పార్టీలు ప్రయత్నించగా సొంత బలం లేకపోతే ఎక్కువ కాలం పదవి ఉండదని గ్రహించిన చంద్రబాబు సున్నితంగా ప్రధాని పదవిని తిరస్కరించాడు. తదనంతరం ఏపీ తెలంగాణ విడిపోవడం నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. అనంతరం రెండో దఫా వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. ఇప్పుడు రాజకీయ గురువు చంద్రబాబు బాటలో కేసీఆర్ పయనిస్తున్నారు.

వాళ్లను మెప్పించేదేలా?

కేంద్రంలోని బీజేపీతో తొలి సారి సీఎంగా అయిన తర్వాత సఖ్యతగా మెలిగిన కేసీఆర్ రెండోసారి గెలిచిన తర్వాత యుద్ధం ప్రారంభించారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణపై ఫోకస్ చేయడం వరుసగా దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీలో విజయాలు ఆ పార్టీకి ఊపు తెచ్చాయి. కేంద్ర విధానాలు, తెలంగాణపై కేంద్రం వైఖరి వంటి అంశాలను అనేక వేదికలపై కేసీఆర్ ఎండగట్టారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన రూ.3లక్షల కోట్ల నిధులు చెల్లించేందుకు కేంద్రం కొర్రిలు పెడుతుందని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రం రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోందని విమర్శిస్తున్నారు. బీజేపీ ప్రస్తుతం దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మెజారిటీ ఎంపీ సీట్లు ఉన్న యూపీలో ఇటీవల అధికారం చేజిక్కించుకుంది. గుజరాత్ లో సైతం తిరుగులేని మెజారిటీతో గెలుపొందింది. బీజేపీకి మూడో దఫా అధికారం కోసం ఈ రెండు రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి. నార్త్ ప్రజలు బీజేపీతో కనెక్ట్ అయ్యారు.

బీజేపీ హిందుత్వ నినాదం ఓటు బ్యాంకుగా మారి రెండు దఫాలు కేంద్రంలో అధికారంలోకి రావడంలో నార్త్ ఓటర్లు కీలక పాత్ర పోషించారు. వారి వారిని ప్రసన్నం చేసుకోవడం మాత్రం కేసీఆర్ కు కష్టమని చెప్పాలి. రాష్ట్రంలో ఎంఐఎంతో అంటకాగుతూ వస్తున్న బీఆర్ఎస్ ను నార్త్ ప్రజలు ఎలా నమ్ముతారు అనేది ప్రశ్నార్థకమే. ఈ రెండు రాష్ట్రాల్లో గట్టిగా ఉన్న బీజేపీని నిలువరించగలిగితేనే కాంగ్రెస్ కైనా, మూడో ఫ్రంట్ కైనా అధికారం దక్కే అవకాశం ఉందనడంతో సంశయం లేదు. మరి నార్త్ ప్రజలు తనను నమ్మేలా కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. పార్టీ విధివిధానాలను ఇతర రాష్ట్రాల్లో ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది మరి కొన్ని రోజుల్లో తేలనుంది. ఇప్పటికే ఇస్ బార్ కిసాన్ సర్కార్ నినాదం ఇచ్చిన కేసీఆర్ ఎర్రకోటపై గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమాతో ఉన్నారు. బీజేపీ లాంటి పార్టీని నిలువరించి కేంద్రంలో చక్రం తిప్పడం కత్తిమీద సాములాంటింది. మరి ఈ ప్రయత్నంలో కేసీఆర్ సక్సెస్ అవుతారా లేదా అనేది 2024 లోక్ సభ ఎన్నికల తర్వాత తెలియనుంది.

Read More....

Koppula Eshwar Vs Thalasani Srinivas Yadav.. మంత్రుల మధ్య పంచాయితీ


Next Story

Most Viewed