కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన KCR విచారణ.. జస్టిస్‌ చంద్రఘోష్‌కు కీలక డాక్యుమెంట్లు అందజేత

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-11 08:58:36  IST  )

కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదట బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది.

కాళేశ్వరం కమిషన్ ఎదుట ముగిసిన KCR విచారణ.. జస్టిస్‌ చంద్రఘోష్‌కు కీలక డాక్యుమెంట్లు అందజేత
X

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) ఎదుట బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విచారణ ముగిసింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ పి చంద్రఘోష్, కార్యదర్శి మురళీధర్ ఆధ్వర్యంలో దాదాపు 50 నిమిషాల పాటు వన్ టూ వన్ విచారణ కొనసాగింది. తనకు జలుబుతో తనకు స్వల్ప అనారోగ్యం ఉందని కమిషన్ చైర్మన్ చంద్రఘోష్‌కు కేసీఆర్ తెలిపారు. అనారోగ్యం కారణంగా ఓపెల్ హాలులో ఫేస్‌ టూ ఫేస్ విచారణ కాకుండా.. వ్యక్తిగతంగా వన్ టూ వన్ ఇన్ కెమెరా విచారణను ఆయన కోరారు. కేసీఆర్ అభ్యర్థనను అంగీకరించిన జస్టిస్ పీ చంద్రఘోష్ ఓపెన్ కోర్టు హాలు నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మీడియాతో సహా అందరినీ బయటకు పంపి ఆ తరువాతే విచారణను ప్రారంభించారు.

ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిది..

దాదాపు 14 నెలల పాటు ఇప్పటి వరకు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, మాజీ మంత్రులను విచారించిన కమిషన్ వారిచ్చిన స్టేట్‌మెంట్‌ను ఆధారంగా కేసీఆర్‌ను 18 ప్రశ్నలతో క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అయితే, కేసీఆర్‌ను 115వ సాక్షిగా కాళేశ్వరం కమిషన్ విచారించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, తీసుకున్న నిర్ణయాలపైనే ప్రధానంగా కేసీఆర్‌కు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఆనకట్టల నిర్మాణ నిర్ణయం ఎవరిదిని అడగ్గా.. కేసీఆర్ రీఇంజినీరింగ్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. అలా బ్యారేజీలు నిర్మించడానికి కేబినెట్ ఆమోదం ఉందా అని ప్రశ్నించగా.. కేబినెట్, ప్రభుత్వం ఆమోదంతోనే నిర్మించామని సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిర్మించిన ప్రతి బ్యారేజీకి అన్ని అనుమతులు తీసుకున్నామని, వ్యాప్కోస్ సిఫారసుల ప్రకారమే నిర్మాణం జరిగిందని అన్నారు.

అనంతరం కమిషన్ కాళేశ్వరం కార్పొరేషన్ గురించి ఆరా తీసింది. కొత్త రాష్ట్రంలో నిధులను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు. ప్రాజెక్ట్‌ను వేగంగా పూర్తి చేసేందుకే కార్పొరేషన్ ఉపయోగపడిందని అన్నారు. అదేవిధంగా బ్యారేజీలో నీటీ నిల్వ గురించి కేసీఆర్‌ను ప్రశ్నించగా.. ఎంత నీరు నిల్వ చేయాలన్నది ఇంజినీర్లు చూసుకుంటారని సమాధానమిచ్చారు. బ్యారేజీల నిర్మాణ స్థలం ఎంపిక, మార్పులు, సాంకేతికపరమైన అంశాలని అన్నారు. ప్రధానంగా నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించామని పేర్కొన్నారు. అందుకు సంబంధించి జీవో నెం.45 ను కమిషన్‌కు అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఆపరేషన్స్ అండ్ మెంటీనెన్స్ పుస్తకాన్ని కూడా చైర్మన్ పీ చంద్రఘోష్‌కు కేసీఆర్ అందజేశారు.

కీలక డాక్యుమెంట్లు అందజేత..

తెలంగాణలో తాగు, సాగు నీటి పరిస్థితులతో పాటు భారతదేశంలో నీటి లభ్యత, వినియోగంపై కమిషన్‌కు మాజీ సీఎం కేసీఆర్ వివరించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరంతో పాటు అనుబంధ ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను ఆయన కమిషన్ చైర్మన్ పి చంద్రఘోష్‌కు అందజేశారు. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్‌ బయటకు వచ్చి అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్కే భవన్‌ నుంచి కారులో మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి నేరుగా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిపోయారు.

Next Story