పార్లమెంట్ స్థానాలపై KCR స్పెషల్ ఫోకస్.. ఆ 7 సీట్లను కైవసం చేసుకునేలా మాస్టర్ ప్లాన్..!

by Disha Web Desk 19 |
పార్లమెంట్ స్థానాలపై KCR స్పెషల్ ఫోకస్.. ఆ 7 సీట్లను కైవసం చేసుకునేలా మాస్టర్ ప్లాన్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు తొలి అడుగు తెలంగాణ నుంచే వేయాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఎంపీ స్థానాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. 17 స్థానాల్లో హైదరాబాద్ మినహా మిగిలిన 16 స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మరోసారి సారు.. కారు.. పదహారు అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లనున్నారు. అన్నింటిలో గెలిచి ఇమేజ్‌ను నిలబెట్టుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ బీఆర్ఎస్‌తో కీ రోల్ పోషించేందుకు కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు.

దానికి తగినట్లుగా వ్యూహాన్ని రచిస్తున్నారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టడంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ కీలకపాత్ర పోషించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తు్న్నారు. అందుకోసం జిల్లాల్లో పార్టీలో ఉన్న బలమైన నేతలతో పాటు సిట్టింగ్ ఎంపీలపై సైతం సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల నేతలపై సైతం ఫోకస్ పెట్టారు. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తే విజయం సాధిస్తారనే వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. విజయం సాధించాలంటే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో అనుసరించాల్సిన విధానాలను సైతం నేతల నుంచి తెప్పించుకుంటున్నారు. వాటి అమలులో సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

2019లో గెలిచింది 9 మందే..

తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్(టీఆర్ఎస్) 17 ఎంపీ స్థానాలకు గాను 11 స్థానాల్లో విజయం సాధించింది. 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సారు.. కారు.. పదహారు నినాదంతో ఎన్నికలకు వెళ్లి 9 స్థానాలకే పరిమితమయింది. రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది.

బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాలను సొంతం చేసుకున్నాయి. కాగా, ఇప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా పేరు మార్చారు. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి సారు.. కారు.. పదహారు అనే నినాదంతో ప్రజల ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో తెలంగాణ వాదం పోవడంతో ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుందో ఈ ఎన్నికల ద్వారా స్పష్టం కానున్నది. అన్ని చోట్లా గెలిస్తేనే త‌న ప్రతిష్ఠ ఇనుమ‌డిస్తుంద‌నే భావ‌న‌లో కేసీఆర్ ఉన్నారు.

7 స్థానాలపై స్పెషల్ ఫోకస్..

రాష్ట్రంలోని ఏడు పార్లమెంట్ స్థానాలపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. గతంలో గెలిచి 2019లో ఓడిన స్థానాలపై ఫోకస్ పెట్టారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి, మల్కాజిగిరి సీట్లను గెలిచేందుకు కార్యచరణ రూపొందిస్తున్నారు. ఎక్కడ ఎవరిని బరిలో నిలిపితే విజయం సాధిస్తారనేదానిపై కసరత్తు చేస్తున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలను సైతం తీసుకొని పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

ఈసారి కొత్తవారికి చాన్స్ ఇవ్వాలన్న ఆలోచనతో.. జిల్లా అధ్యక్షుల్లో కొందరిని ఎంపీలుగా పోటీ చేయించేందుకు కేసీఆర్ ప్రిపేర్ చేస్తు్న్నారనే టాక్ వినబడుతున్నది. నాగర్ కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నల్గొండ నుంచి దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత, మహబూబ్‌నగర్ నుంచి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మెదక్ నుంచి పద్మా దేవేందర్ రెడ్డి, భువనగిరిలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ప్రమోట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్నది.

ఇవి కూడా చదవండి : దేశ వ్యాప్తంగా తెలంగాణ ఫార్ములా.. బీజేపీ నయా స్ట్రాటజీ ఇదే?



Next Story