BRS విస్తరణకు కేసీఆర్ భారీ స్కెచ్

by Disha Web Desk |
BRS  విస్తరణకు కేసీఆర్ భారీ స్కెచ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నందున మరే రాష్ట్రంకంటే, కేంద్ర ప్రభుత్వంకంటే తెలంగాణ అన్ని రంగాల్లో బెటర్‌గా ఉన్నదనేది ఎస్టాబ్లిష్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నొక్కిచెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్ల పాలనలో అమలులోకి వచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ తో పాటు అభివృద్ధి పనులను కూడా జాబితాగా తయారుచేసి పాపులర్ చేసుకోవాలని ఆయా శాఖల మంత్రులు, అధికారులకు సూచించారు. తెలంగాణను రోల్ మోడల్‌గా నేషనల్ లెవల్‌లో ప్రచారం చేసుకోవాలనుకుంటే మాటల్లో కాకుండా నిర్దిష్టంగా ఒక్కో స్కీమ్, ప్రాజెక్టులవారీగా స్లైడ్స్, ఇమేజ్‌లను తయారుచేయాల్సిందిగా సూచించారు. ఈ అంశానికి తోడు సంక్షేమ రాష్ట్రంగా ఉన్నందున ప్రతీ వెల్ఫేర్ డిపార్టుమెంటులో ఇద్దరు చొప్పున ఐఏఎస్ అధికారులు ఉండాలని సూచించారు. త్వరలోనే దళితబంధుకు కూడా కనీసంగా రూ. 2,000 కోట్లను విడుదల చేయాలన్న ప్రాథమిక నిర్ణయం జరిగినట్లు తెలిసింది.

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కేబినెట్‌లో జరిగిన చర్చ సందర్భంగా దళితబంధు స్కీమ్‌కు వీలైనంత తొందరగా నిధులను విడుదల చేసి వేగవంతం చేయాలనే నిర్ణయం జరిగినట్లు మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఈ స్కీమ్‌కు రూ. 17,700 కోట్లు ప్రభుత్వం కేటాయించినందున ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ జారీచేసింది. కానీ నిధులు మాత్రం విడుదలకాలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని జిల్లాల్లో లబ్ధిదారులకు అందేలా ఫండ్స్ రిలీజ్ చేయాలని సీఎం ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే ఈ నిధులు లబ్ధిదారులకు చేరుతాయని, ఆర్థిక శాఖ ఆ దిశగానే సందర్భాన్ని బట్టి రిలీజ్ చేస్తుందని తెలిపారు.

తెలంగాణను పాపులర్ చేయడంపై..

సంక్షేమ రంగంతో పాటు అభివృద్ధిలోనూ తెలంగాణను నమూనాగా పాపులర్ చేయడానికి కేవలం మాటలతోని కాకుండా నిర్దిష్టంగా ఏ స్కీమ్ కింద ఎంత మంది లబ్ధిదారులు, ప్రభుత్వ సాయం, దాని ద్వారా కలిగిన లబ్ధి, జీఎస్‌డీపీలో అది ప్రతిబింబించిన తీరు, ఇతర రాష్ట్రాలు దీనిని అనుసరించడం తదితరాలన్నింటికీ వేర్వేరుగా ఆయా శాఖలు పబ్లిసిటీ డిజైన్‌లను తయారుచేయడంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఉదాహరణగా, 24 గంటల విద్యుత్ సౌకర్యం, వ్యవసాయ రంగానికి ఉచితంగా ఇవ్వడం, ఎస్సీ-ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఫ్రీ, లాండ్రీ-సెలూన్‌లకు రాయితీలు.. ఇలాంటివి ఉంటాయని పేర్కొన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, ఆసరా పింఛన్లు.. ఇలా అన్నింటిపై పబ్లిసిటీ స్లైడ్స్ తయారవుతాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా థర్మల్ ప్రాజెక్టులు, రైతు వేదికలు తదితర అన్ని అంశాలనూ ప్రస్తావించాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలుకావడానికి వీలుగా అన్ని వెల్ఫేర్ డిపార్టుమెంట్లలో కార్యదర్శి, కమిషనర్ స్థాయిల్లో వేర్వేరు ఐఏఎస్ అధికారులు ఉండాలని సీఎం నొక్కిచెప్పినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ వెల్ఫేర్ డిపార్టుమెంటులో మాత్రమే ఇద్దరు వేర్వేరుగా ఉన్నారని, ఎస్టీ, బీసీ శాఖల్లో మాత్రం ఒక్కరే ఉన్నారని, వీలైనంత తొందరగా దాన్ని కూడా పునర్ వ్యవస్థీకరించాల్సిందిగా సీఎస్‌ను ఆదేశించినట్లు తెలిపారు. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండడం, మరోవైపు జాతీయ స్థాయిలో పార్టీని విస్తరిస్తుండడం లాంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ మోడల్‌ను అన్ని రాష్ట్రాల చెంతకు తీసుకెళ్ళడం, అక్కడి ప్రజలకు ఈ స్కీమ్‌లపై అవగాహన కలిగించడం ఈ పబ్లిసిటీ వెనక ఉన్న ప్రధాన లక్ష్యమని వివరించారు.

ఆర్థిక వనరుల సమీకరణపై..

కేంద్ర ప్రభుత్వం నుంచి అంచనాల ప్రకారం గ్రాంట్లు అందకపోవడం, ఆర్బీఐ నుంచి తీసుకోవాల్సిన స్టేట్ డెవలప్‌‌మెంట్ లోన్లకు ఆర్థిక శాఖ ద్వారా ఆంక్షలు ఎదురుకావడం ద్వారా సుమారు రూ. 40 వేల కోట్లు నష్టపోయినట్లు సీఎంఓ ఒక ప్రకటనలో ఇటీవల పేర్కొన్నది. నిర్దిష్టంగా ఖజానాకు అందని వివరాలన్నింటినీ ఆర్థిక శాఖ మంత్రివర్గ సమావేశంలో నివేదిక రూపంలో అందజేసింది. ప్రత్యామ్నాయంగా రాష్ట్రమే స్వంతంగా నిధులను ఏ తీరులో సమీకరించుకోవాలో ఆర్థిక మంత్రి, అధికారులు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి విడిగా చర్చించినట్లు పేర్కొన్నారు. స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి అంచనాల ప్రకారమే ఆదాయం వచ్చిందో లేదో ఆరా తీసినట్లు పేర్కొన్నారు.

Also Read...

ఢిల్లీ పాలిటిక్స్ రాజశ్యామల యాగంతో షురూ!



Next Story