"కంటి వెలుగు" పేరుతో హిందువులను వేధిస్తున్న కేసీఆర్: వీహెచ్‌పీ

by Disha Web Desk |
కంటి వెలుగు పేరుతో హిందువులను వేధిస్తున్న కేసీఆర్: వీహెచ్‌పీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కంటి వెలుగు కార్యక్రమం పేరుతో సంక్రాంతి పండగ పూట వైద్య విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ ఇబ్బందులకు గురి చేస్తోందని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. జనవరి 14,15 తేదీల్లో సంక్రాంతి పండగ ఉందని అవి కూడా రెండవ శనివారం, ఆదివారం ఈ రెండు రోజులు సెలవు రోజులే అయినప్పటికీ కంటి వెలుగు కార్యక్రమం పేరుతో ఆ రెండు రోజులు ఉద్యోగులందరినీ విధులకు రావాలని చెప్పడం దుర్మార్గమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పండుగల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం హిందూ వ్యతిరేక చర్యల్లో భాగమేనని మండిపడ్డారు. కంటి వెలుగు కార్యక్రమంలో విధులు నిర్వహించేలా బలవంతంగా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడానికి విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కుటుంబంతో పండగ జరుపుకోవాల్సిన హిందూ ఉద్యోగులను విధులకు రావాలని బలవంత పెట్టడం సరికాదన్నారు.

రంజాన్, క్రిస్మస్ పండగలకు ప్రత్యేకమైన సెలవులు ప్రకటిస్తూ, అవసరం లేకున్నా ఆప్షనల్ హాలిడేస్ ఇస్తున్నారని, అదే హిందూ పండగల విషయంలో మాత్రం వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. సంక్రాంతి పండగ నాడు విధులకు హాజరు కావాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, కమిషనర్‌తో సంప్రదించాలని ప్రయత్నిస్తే వారు అందుబాటులో లేరని అన్నారు. ఈ విషయంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వైద్య విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులందరికీ పండగ సెలవు యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు.

Next Story

Most Viewed