కేసీఆర్ క్యాన్సర్ కిట్లు'.. లక్షణాలున్న వారికి మెడిసిన్స్​

by Disha Web Desk 12 |
కేసీఆర్ క్యాన్సర్ కిట్లు.. లక్షణాలున్న వారికి మెడిసిన్స్​
X

క్యాన్సర్ బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 'కేసీఆర్ క్యాన్సర్ కిట్లు' అనే కార్యక్రమాన్ని చేపట్టేందుకు రెడీ అవుతుంది. త్వరలోనే దీనిని అమలు చేయనున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సైతం సిద్ధం చేస్తున్నది. బాధితులకు ఇంటి వద్ద వీటిని అందించాలని భావిస్తున్నది. ఇప్పటికే జిల్లా స్థాయిలో అన్ని రకాల క్యాన్సర్ పేషెంట్ల వివరాలు అధికారులు సేకరిస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : క్యాన్సర్​పేషెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. 'కేసీఆర్ క్యాన్సర్ కిట్లు' పేరుతో లక్షణాలున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. రోగులను గుర్తించి వారి ఇంటి వద్దకే మెడిసిన్స్​ఇవ్వాలని అనుకుంటున్నది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని బాధితులకు ఇవి అందజేయనున్నది. డాక్టర్లు సూచించిన మందులను ఆ కిట్‌లో ఉంచి ఇచ్చేందుకు సర్కార్ ప్లాన్​చేస్తున్నది. ఇప్పటికే జిల్లా స్థాయిలో అన్ని రకాల క్యాన్సర్​పేషెంట్ల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. బాధితుల సంఖ్యను బట్టి మందులు కొనుగోలు చేయనున్నట్లు ఓ ఆఫీసర్​తెలిపారు.

చికిత్సలో జాప్యం

క్యాన్సర్​వ్యాధి‌లో ప్రధానంగా మూడు రకాల చికిత్స ఉంటుంది. సర్జరీ, రేడియోథెరపీ, కీమో థెరఫీ విధానాలను ప్రయోగిస్తారు. ఆ తర్వాత కొందరు కొన్నాళ్ల పాటు మందులు వాడాల్సి ఉంటే.. మరి కొందరు లాంగ్​టైమ్ ​వరకు వినియోగించాలి. అయితే ఇలాంటి మందులు కేవలం హైదరాబాద్‌లో మాత్రమే లభిస్తున్నాయి. ఇక్కడి పేషెంట్లు రెగ్యులర్​ట్రీ‌ట్‌మెంట్‌ను ఫాలో అవుతుండగా, జిల్లాల్లోని రోగులకు ఇబ్బందులు వస్తున్నాయి.

మెడిసిన్స్ ​వాడటంలో నిర్లక్ష్యం చేయడంతో చాలా మంది పేదల ఆరోగ్యం క్షీణిస్తుంది. మరోవైపు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేని వారు కూడా ఈ మందులు నిత్యం కొనుగోలు చేయాలంటే కష్టతరంగా మారింది. రాష్ట్రంలోని పేషెంట్లందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా ఎంఎన్‌జేలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నప్పటికీ జిల్లాల్లో ఈ సౌకర్యం లేదు. దీంతో ఈ క్యాన్సర్​ సెంట్రల్ ​సెంటర్ ​నుంచి పేషెంట్ల ఇంటి వద్దకే కిట్లు అందజేయాలని ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నది.

జిల్లాలో స్క్రీనింగ్

క్యాన్సర్‌ను ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తే బెటర్​ట్రీట్‌మెంట్ ఇవ్వొచ్చని ఇటీవల ఎంఎన్‌జే క్యాన్సర్​ఆస్పత్రి సర్కార్‌కు రిపోర్టు ఇచ్చింది. దీంతో జిల్లాలో మొబైల్​ స్క్రీనింగ్ నిర్వహించాలని ప్రభుత్వం గ్రీన్​సిగ్నల్​ఇచ్చింది. ప్రస్తుతం మొబైల్ స్క్రీనింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. లక్షణాలున్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఒక్కో నెలలో సగటున 6 క్యాంపులు పెడుతూ సగటున 600 నుంచి 800 మందికి పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయినా వారిని మెరుగైన చికిత్స కోసం ఎంఎన్‌జే‌కు రిఫర్​చేస్తున్నారు.

అయితే పుండ్లు, కణితులు తదితర రకాల లక్షణాలున్న వారికి స్క్రీనింగ్ సమయంలోనే కొన్ని రకాల యాంటీబయాటిక్స్​ఇవ్వనున్నారు. అప్పటికీ తగ్గకపోతే క్యాన్సర్​పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంకాలజిస్టులు సూచించిన విధానాన్ని ఫాలో కానున్నారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ లక్షణాలు లేకపోయినా, స్క్రీనింగ్​ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఈ మేరకు తెలంగాణ డయాగ్నస్టిక్​ కేంద్రాల్లోనే కాన్సర్‌ను గుర్తించడానికి అవసరమైన మమ్మోగ్రఫీ , బయాప్సీ వంటి అత్యాధునిక సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవి కూడా చదవండి: కుటుంబానికి దూరమవుతున్న నేతలు.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో అసహనం!

Next Story