నేతాజీ జయంతి సందర్భంగా సంచలన డిమాండ్.. ప్రధాని మోడీకి కవిత లేఖ

by Ramesh Naini |   (  Updated:2026-01-23 10:34:02  IST  )

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో శక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

నేతాజీ జయంతి సందర్భంగా సంచలన డిమాండ్.. ప్రధాని మోడీకి కవిత లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో శక్రవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు, జాగృతి నాయకులు పాల్గొన్నారు. నివాళుల అనంతరం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలతో కవిత సమావేశమయ్యారు. అండమాన్-నికోబార్ దీవుల పేరును మార్చి ‘ఆజాద్ హిందూ’గా నామకరణం చేయాలన్న ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్‌కు తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని కవిత స్పష్టం చేశారు. ఈ డిమాండ్‌కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసినట్లు వెల్లడించారు.

ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ ఉద్యమం

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, అండమాన్ నికోబార్ అనే పేరు బ్రిటిష్ పాలకులు పెట్టినదని, వారి గుర్తింపును కొనసాగించకుండా దేశ స్వాతంత్ర్య పోరాటానికి ప్రాణం పెట్టిన నేతాజీ పేరును ఆ దీవులకు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 26న దేశవ్యాప్తంగా ట్విట్టర్‌లో హ్యాష్‌ట్యాగ్ ఉద్యమం నిర్వహిస్తామని, జాగృతి నెట్‌వర్క్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం జనవరి 26న నేతాజీ గౌరవార్థం అండమాన్ పేరు మారుస్తుందని ఆశిస్తున్నట్లు కవిత పేర్కొన్నారు. స్వాతంత్రం అడిగితే రాదని, తీసుకోవాలని నేతాజీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. యువత రక్తం ఇస్తే స్వాతంత్రం తెస్తానని ఆయన ఇచ్చిన పిలుపు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఉన్నత కుటుంబంలో పుట్టి, ఐఏఎస్‌లో నాలుగో ర్యాంక్ సాధించినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి పని చేయలేనని ఆ పదవిని వదిలేసి ఆజాద్ హిందూ ఫౌజ్‌ను స్థాపించిన నేతాజీ త్యాగాన్ని కవిత కొనియాడారు.

ఝాన్సీ లక్ష్మీభాయ్ రెజిమెంట్‌ను ఏర్పాటు

మహిళలకు సైన్యంలో అవకాశం కల్పించి ఝాన్సీ లక్ష్మీభాయ్ రెజిమెంట్‌ను ఏర్పాటు చేసిన నేతాజీ దూరదృష్టిని కవిత గుర్తు చేశారు. నేటికీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో ప్రభుత్వాలు ఆలస్యం చేస్తున్నాయని విమర్శించారు. నేతాజీ దేశం గర్వించదగ్గ మహానాయకుడని, ఆయన లెగసీని కాపాడుకోవాలంటే అండమాన్ -నికోబార్ దీవులకు తప్పకుండా ‘ఆజాద్ హిందూ’ అనే పేరు పెట్టాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. గతంలో రాజకీయ లబ్ధి కోసం హైదరాబాద్ పేరు మార్పు హామీలు ఇచ్చిన బీజేపీ, నేతాజీ వంటి మహానాయకుల విషయంలో మాత్రం చిత్తశుద్ధితో ముందుకు రావాలని ఆమె కోరారు.

Read More... TG: కొత్త పార్టీకి ముందే కవిత భారీ స్కెచ్.. మున్సిపల్ ఎన్నికల్లో ఆ గుర్తుతో బరిలోకి జాగృతి?

Next Story