కార్మికుల పోరాటమే మేడే కు స్ఫూర్తి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

by Kodari Anjali |

అన్ని రంగాల కార్మికులకు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.

కార్మికుల పోరాటమే మేడే కు స్ఫూర్తి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
X

దిశ, తంగళ్లపల్లి: అన్ని రంగాల కార్మికులకు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మే డే సందర్భంగా తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్‌లో వేడుకలను శుక్రవారం నిర్వహించగా, ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి. గితే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. కార్మికులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు. మే డే వేడుకలు ఆనాడు కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి స్పూర్తిగా నిర్వహిస్తున్నారని తెలిపారు. కార్మికుల కష్టం, చెమట చుక్కలతో రూపు దిద్దుకున్న వస్తువులను మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నామని తెలిపారు.

ఆర్టీసీలో ఉన్న సమస్యలను మూడు రోజుల్లోనే..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిగ్ వర్కర్ల కోసం అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారని, వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. దేశంలోని ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కార్మికుల శ్రమ వల్ల నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయని వివరించారు. వేలాది మంది కార్మికులు పని చేస్తున్న ఆర్టీసీలో ఉన్న సమస్యలను మూడు రోజుల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ముంగిపు పలికారని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఐటీఐ లను ఏటీసిలుగా అప్ గ్రేడ్ చేసిందని వెల్లడించారు. రతన్ టాటా వారితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి.. నూతన టెక్నాలజీకి అనుగుణంగా మండేపల్లి, రుద్రంగికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు మంజూరు చేశారని వెల్లడించారు. కార్మిక శాఖ ఆద్వర్యంలో అందించే వివిధ పథకాలు వినియోగించాలని పిలుపు నిచ్చారు.

అందరికీ గౌరవం ఇవ్వాలి..

మహాత్మా గాంధీజీ ప్రకారం అందరికీ సమాన గౌరవం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు తీసుకువచ్చి అమలు చేస్తున్నదని తెలిపారు. కార్మికులకు కనీస వసతులు కల్పిస్తుందని వివరించారు. భవన నిర్మాణ కార్మికులు కార్మిక శాఖ వద్ద తమ పేర్లు నమోదు చేసుకోవాలని, ఆ శాఖ ద్వారా అందించే పథకాలు, లబ్ధి పొందాలని సూచించారు. అర్హులందరూ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కార్మికులకు బీమా చేయిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల వారికి కూడా ప్రభుత్వం బీమా అందిస్తుందని వివరించారు. అర్హులైన వారికి త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమాను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నదని పేర్కొన్నారు. స్థానిక పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా యువత, విద్యార్థులకు శిక్షణ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా అందిస్తున్నారని తెలిపారు.

బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన..

శిక్షణ పూర్తి అయిన తర్వాత ఉపాధి అవకాశాలు కలుగుతున్నాయని వెల్లడించారు. శిక్షణకు యువత తప్పకుండా హాజరు కావాలని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ శిక్షణ పొందుతున్న వారు అందరూ ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఉత్తమ ప్రతిభ చూపిన పలు సంస్థలు, ఉద్యోగులు, విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి అభినందించారు. వైద్య ఆరోగ్య శాఖ, బ్యాంక్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేంద్రాచారి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, పరిశ్రమల శాఖ అధికారి హనుమంతు, జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి రాందాస్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున రావు, ప్రిన్సిపాల్ కవిత, సర్పంచులు సాగర్, రచనలు పాల్గొన్నారు.

Next Story