ఓట్లు వేసిన పాపానికి ర‌క్తం క‌ళ్లు చూస్తారా..?

by Ratna Kumari |

గన్నేరువరం మండలంలో డబుల్ రోడ్డు పై రక్త హోలీ జ‌రిగింది. రోడ్డు పై కూర్చొని మొహం పై రంగు చల్లుకుని హోలీ పండుగ సందర్భంగా మంగళవారం వినూత్న నిరసన తెలిపారు బీజేపీ నియోజక వర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి.

ఓట్లు వేసిన పాపానికి ర‌క్తం క‌ళ్లు చూస్తారా..?
X

దిశ, గన్నేరువరం : గన్నేరువరం మండలంలో డబుల్ రోడ్డు పై రక్త హోలీ జ‌రిగింది. రోడ్డు పై కూర్చొని మొహం పై రంగు చల్లుకుని హోలీ పండుగ సందర్భంగా మంగళవారం వినూత్న నిరసన తెలిపారు బీజేపీ నియోజక వర్గ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుండ్లపల్లి- పొత్తూరు రహదారి దుస్థితిని నిరసిస్తూ నడి రోడ్డుపై ఆందోళనకు దిగిన ఆయన, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టారు. గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు ఉన్న ఈ డబుల్ రోడ్డు కోసం దశాబ్దాలుగా ప్రజలు వేచిచూస్తున్నారు. ప్రతి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం ప్రతి ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేయడం తప్ప ప్రజలకు మాత్రం గాయాలు, ప్రమాదాలే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.71 కోట్ల జీవో తీసుకొచ్చి శంకుస్థాపన చేసి ప్రచారంతో సరిపెట్టుకుందని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే “100 రోజుల్లో రోడ్డు నిర్మిస్తా” అని హామీ ఇచ్చి, ఉన్న రహదారినే చెడగొట్టి కంకర పోసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. నిత్యం ఆ కంకర రాళ్లు ఎగిరిపడి చిన్నారులు, వృద్ధులు గాయపడుతున్నారని తన మొఖంపై ఉన్న హోలీ రంగులా ప్రజల ముఖాలపై రక్తపు మచ్చలు పడుతున్నాయని, ఓట్లేసిన పాపానికి ప్రజల రక్తం కళ్లతో చూడాలా? అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. వర్షాకాలం వస్తే మండలం మొత్తం జలదిగ్బంధనానికి గురవుతుందని, అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి తలెత్తుతుందని హెచ్చరించారు. ఈ రహదారి కేవలం అసౌకర్యం కాదు.. ఇది ప్రాణహాని అని, ప్రతి రోజు ప్రమాదాల అంచున ప్రజలు జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల ప్రాణాలు కూడా విలువైనవేనని, వెంటనే సీఎం రేవంత్ రెడ్డి మానకొండూరు నియోజకవర్గం లోని గన్నేరువరం రోడ్డుకు నిధులు మంజూరు చేసి రోడ్డు పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన గతంలో కన్నా మరింత ఉవ్వెత్తున రోడ్డు ఉద్యమం ప్రారంభం అవుతుందని హెచ్చరించారు.

Next Story