పార్టీ మారి.. పదవులు అనుభవిస్తున్నది ఎవరు : జడ్పీటీసీ పూర్మాణి సంచలన వాఖ్యలు

by Disha Web Desk 1 |
పార్టీ మారి.. పదవులు అనుభవిస్తున్నది ఎవరు : జడ్పీటీసీ పూర్మాణి సంచలన వాఖ్యలు
X

మంత్రికి కేటీఆర్ కు తలనొప్పిగా తంగళ్లపల్లి రాజకీయాలు

దిశ, సిరిసిల్ల : మంత్రి కేటీఆర్ ఇలాఖాలో అంతర్గత విబేధాలు మెల్లమెల్లగా బహిర్గతం అవుతున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గ పరిధిలోని తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ లో వర్గపోరు కొనసాగుతోంది. నాయకులు ఎక్కడికక్కడ గ్రూపులు కడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ప్రత్యేకించి కొంత కాలంగా స్థానిక ఎంపీపీ, జడ్పీటీసీ లకు సరిగ్గా పొసగడం లేదంటూ మండల ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. కొన్ని సమావేశాల్లో జడ్పీటీసీని స్థానిక ఎంపీపీ అవమానించారని, అందుకే ఆవిడ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

స్థానిక ఎంపీపీ జడ్పీటీసీ టికెట్ ఆశిస్తున్నట్లు అందుకే మంత్రి కేటీఆర్ కు సాన్నిహిత్యంగా ఉంటున్నట్లు మండల బీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అంతే కాకుండా మంత్రి కేటీఆర్ జడ్పీటీసీ టికెట్ తనకే ఇస్తున్నాడని ఎంపీపీ భర్త బహిరంగంగానే చెప్పుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, ఆదివారం జడ్పీటీసీ పూర్మాణి మంజుల రాంలింగారెడ్డి ఓ కార్యక్రమంలో చేసిన ఘాటు వాఖ్యలు అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి. తాను పార్టీ మారుతానని.. తనకు టికెట్ రాదంటూ కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారి పదవులు అనుభవిస్తున్నది ఎవరో ప్రజలకు తెలుసని విమర్శించారు.

రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపతున్నారు. మండల ప్రజల అండదండలు తమకు ఉన్నాయని, మంత్రి కేటీఆర్ అండదండలతో మూడోసారి కూడా జడ్పీటీసీగా బరిలో ఉంటానంటూ ధీమాతో ప్రజల్లో తిరుగుతున్నారు. నిజానికి పూర్మాణి మంజుల లింగారెడ్డి తంగళ్లపల్లి మండల రాజకీయాల్లోనే కాకుండా సిరిసిల్ల రాజకీయాల్లో గట్టి పట్టున్న వ్యక్తి. ప్రజల ప్రోద్బలంతో మంత్రి అండతో రెండుసార్లు జడ్పీటీసీగా భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే, ఇప్పుడు జడ్పీటీసీ టికెట్ ఎవ్వరికి అని మండల వ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఏది ఏమైనప్పటికీ తంగళ్లపల్లి మండల రాజకీయ విభేదాలు మంత్రి కేటీఆర్ కు తలనొప్పి తెచ్చేలా మారుతున్నాయని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.



Next Story

Most Viewed