ప్రజల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్న సర్కార్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 1 |
ప్రజల ప్రాణాలతోనే చెలగాటమాడుతున్న సర్కార్ : ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్
X

ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధం

ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే ఫ్యాక్టరీ నిర్మించాలి

దిశ, వెల్గటూర్ : స్థంభంపల్లి వద్ద ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడబోతోందని, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ఫ్యాక్టరీని ఇక్కడే నిర్మిస్తే.. ప్రాణత్యాగం చేసి క్రిబ్ కో కంపెనీని తరిమి కొడతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హెచ్చరించారు. స్తంభంపల్లి గ్రామంలో నిర్మించే ఇథనాల్ ఫ్యాక్టరీ సందర్శనకు డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శనివారం వెళ్లారు.

విషయం తెలుసుకున్న స్థంభంపల్లి, వెంకటాపూర్, పాషిగాం, వెల్గటూర్ గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలి వచ్చారు. ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రజల అభిప్రాయాన్ని జీవన్ రెడ్డి కోరగా మహిళలు కన్నీళ్లతో వారి బాధలను వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే భవిష్యత్తులో తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఎలాగైనా దీనిని ఇక్కడ నుంచి తరలించే ఏర్పాటు చేయాలని ప్రజలంతా ముక్త కంఠంతో జీవన్ రెడ్డిని వేడుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజలతో కలిసి ఇథనాల్ ప్రదేశాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ... ఇథనాల్ ఫ్యాక్టరీ విషతుల్యమైందని ప్రజలంతా గమనించాలన్నారు. విష వాయువులను వెదజల్లే ఫ్యాక్టరీని తెచ్చి జనావాసాల మధ్య నిర్మించడం ప్రభుత్వ దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఈ ప్రాంతాన్ని వదిలేసి ఇక్కడి వారంతా ఎక్కడికి వెళ్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రసానిక ఎరువులు అధికంగా చల్లిన పంటలను తినడం వల్లే మనం రోగాల బారిన పడుతున్నామని శాస్త్రవేత్తలు ఓ వైపు హెచ్చరిస్తున్నారు.

అలాంటి రసాయనిక ఎరువుల తయారీలో వాడే ఇథనాల్ ఫ్యాక్టరీని ఇక్కడ నిర్మిస్తే ఊళ్లన్ని స్మశానాలు అవుతాయని ప్రభుత్వంపై మండిపడ్డారు. సిద్దిపేట, సిరిసిల్లలో నిర్మించదలచుకున్న ఈ ఫ్యాక్టరీని ఇక్కడికి ఎందుకు మార్చారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ గురించి మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిసి చేస్తున్నారో తెలియక ప్రవర్తిస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు. ప్రజల ప్రాణాలను హరించే ఫ్యాక్టరీని తీసుకొచ్చి జనావసాల మధ్య ఎందుకు పెడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

క్రిబ్ కో సంస్థ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మంత్రిని ప్రశ్నించారు. క్రిబ్ కోతో మంత్రికి ఎంత మేర ఒప్పందం జరిగిందో తెలియాలన్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తక్షణమే బాధిత గ్రామాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకుని విషయాన్ని ప్రభుత్వానికి నివేదించాలన్నారు. పరిశ్రమ నిర్మించే ప్రదేశాన్ని చదును చేసేందుకు రూ.13 కోట్లను ప్రభుత్వం వెచ్చించింది. ఆ రూ.13 కోట్లను మరో చోట వెచ్చించి జనావాసాలు లేని చోట భూమిని కొనుగోలు చేసి పరిశ్రమ నిర్మించవచ్చన్నారు.

నీరు, భూమి, అధికారం అన్ని అందుబాటులో ఉన్న సిరిసిల్లలో ఇథనాల్ పరిశ్రమను కేటీఆర్ ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక టీఎంసీ నీటిని వినియోగించి ఇథనాల్ ఉత్పత్తి చేస్తారని, ఈ క్రమంలో విడుదలయ్యే వ్యర్థ్యాలను భూమిలోకి విడుదల చేస్తారని తెలిపారు. దీంతో ఈ ప్రాంతం అంతా కలుషితమై పంటలు కూడా పండే అవకాశం ఉండదన్నారు. కాలేశ్వరం మూడో టీఎంసీ పేరుతో వెల్గటూర్ రైతులను ఇప్పటికే నిండా ముంచారని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు ఇతనాల్ ఫ్యాక్టరీ పేరుతో నాలుగు గ్రామాల ప్రజల ప్రాణాలకే ఎసరు పెట్టారని మండిపడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఉన్నత స్థాయి అధికారులు ఇథనాల్ బాధాత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తరువాతే ఫ్యాక్టరీ నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. కాదని మొండిగా వ్యవహరిస్తే.. యావత్ కాంగ్రెస్ పార్టీ ఇథనాల్ బాధితులకు అండగా ఉండి ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకుంటుదన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు బొప్పు తిరుపతి, మేరుగు మురళి, ఎంపీటీసీ సతీష్, నాయకులు శైలేందర్ రెడ్డి, మద్దెల రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story