ప్రభుత్వ భూమిలో గుడి నిర్మాణం నిలిపివేయాలి

by Nallavelli.Anjaneyulu |

ప్ర‌జ‌ల అవ‌స‌రాల కోసం ప్రభుత్వ భూమిని వినియోగించాలి కానీ ప్రైవేట్ నిర్మాణాల కొరకు అనుమతి నిరాకరించాలని అంటూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు, వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు లచ్చపేట గిరిజనులు.

ప్రభుత్వ భూమిలో గుడి నిర్మాణం నిలిపివేయాలి
X

దిశ, కోనరావుపేట : ప్రజా ప్రయోజన అవసరాలకే ప్రభుత్వ భూమికి వినియోగించాలి కానీ ప్రైవేట్ నిర్మాణాల కొరకు అనుమతి నిరాకరించాలని అంటూ సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కు, వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి వినతి పత్రం అందజేశారు లచ్చపేట గిరిజనులు. రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని, గోవిందరావుపేట గ్రామ పంచాయతీ పరిధిలోనీ లచ్చపేట తండా ప్రజల స్థానిక అవసరాల నిమిత్తం గత రెండు సంవత్సరాల క్రితం ప్రభుత్వం రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తే.. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఆ భూమిలో దేవాలయ నిర్మాణం చేప‌ట్టాల‌ని చూస్తూ ఆక్రమణకు పాల్పడుతున్నార‌ని.. ఇది ప్రభుత్వ నిబంధనలకు పూర్తి విరుద్ధమని లచ్చపేట తండా వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా లచ్చపెట్ట తండా యువకులు మాట్లాడుతూ భవిష్యత్తులో మా తండాలో జనాభా దృష్టిలో పెట్టుకొని మాకు కేటాయించిన ఈ ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ దవాఖాన, పాఠశాల, గ్రామపంచాయితీ వంటి భవనాలను నిర్మించుకోవాలని ఆలోచనలో మేము ఉంటే.. కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమిని ఆక్రమించాలనే ఉద్దేశంతో గుడి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అని తెలిపారు. ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేలా చర్యలు తీసుకొని ఉంటే.. ఆ గుడి నిర్మాణ పనులను నిలిపివేసి మాకు న్యాయం జరిగేలా చూడాలని కలెక్టర్, స్థానిక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తండా వాసులు వేడుకున్నారు. కార్యక్రమంలో లచ్చపేట తండా యువకులు,గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story