సకల జనుల సమ్మె చేయకపోతే రాష్ట్రం వచ్చేదా..! : ఎంపీ అరవింద్

by Disha Web Desk 1 |
సకల జనుల సమ్మె చేయకపోతే రాష్ట్రం వచ్చేదా..! : ఎంపీ అరవింద్
X

జేపీఎస్ ల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి

దిశ, జగిత్యాల ప్రతినిధి : జూనియర్ పంచాయతీ సెక్రటరీలు చేపట్టిన నిరసన దీక్షలు చూస్తూ ఉంటే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన సమయంలో చేసిన సకల జనుల సమ్మె గుర్తుకు వస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్ హాల్ లో పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన నిరసన దీక్షకు ఎంపీ అరవింద్ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు స్వరాష్ట్ర సాధన కోసం సకల జనులు చేసిన సమ్మెకు మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్ నేడు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ హక్కుల కోసం సమ్మె చేస్తుంటే ఉద్యోగాల నుండి తొలగిస్తామని బెదిరిస్తాడా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమంలో అటుకులు తింటూ ఆంధ్రోళ్లతో కొట్లాడామని చెప్పిన కేసీఆర్ ఆరోజు నువ్వు బిర్యానీలు తింటే రాష్ట్రం కోసం అటుకులు తిన్నది ప్రభుత్వం చిరు ఉద్యోగులు కాదా అని ప్రశ్నించారు.

ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పినప్పటికీ భయపడకుండా దీక్షలు చేస్తున్న సెక్రటరీలను చూస్తూ ఉంటే సీఎం కేసీఆర్ కు ఎవరూ భయపడడం లేదని స్పష్టమవుతుందన్నారు. ఈ రోజు పంచాయతీ సెక్రటరీలు చేస్తున్న నిరసన దీక్షకు బిజెపి మద్దతిస్తుందని పోరాటానికి అండగా ఉంటామని కార్యదర్శులకు భరోసా ఇచ్చారు. సంఘీభావం తెలిపిన వారిలో జిల్లా అధ్యక్షుడు పైడిపల్లి సత్యనారాయణ రావు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ భోగ శ్రావణి, అసెంబ్లీ కన్వీనర్ మదన్ మోహన్, కోరుట్ల బీజేపీ నాయకుడు సురభి నవీన్ రావు, రైతు నాయకుడు పన్నాల తిరుపతిరెడ్డి, పడాల తిరుపతిరెడ్డి ఇతర బీజేపీ నాయకులు ఉన్నారు.

Next Story

Most Viewed