వృద్ధురాలిపై పిచ్చికుక్క దాడి.. పరిస్థితి విషమం

by Disha Web Desk 4 |

దిశ, మల్లాపూర్: పిచ్చికుక్క దాడితో వృద్ధురాలు ప్రాణాపాయ స్థితికి పోయిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. మధ్యాహ్నం ఆరుబయట 80 సంవత్సరాల వృద్ధురాలు పడుకొని ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. మండలంలోని కుస్థాపూర్ గ్రామంలో మండోజి లసుంబాయ్(80) అనే వృద్ధురాలు తన ఇంటి ఆరుబయట పడుకొని ఉండగా.. ఓ పిచ్చి కుక్క వచ్చి క్రూరంగా దాడి చేసింది. వృద్ధురాలి అరుపులు, కేకలతో అక్కడికి చేరుకున్న చుట్టుపక్కల ప్రజలు పిచ్చి కుక్కను తరిమారు. వృద్ధురాలు రక్తపుమడుగులో మునిగిపోయి ఉండడాన్ని చూసిన గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒంటరిగా ఉండి నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిపై కుక్కలు దాడి చేయడంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వృద్ధురాలిని ఆంబులెన్స్ సహాయంతో మెట్ పల్లి ఆసుపత్రికి తరలించగా.. అక్కడ ఉన్న డాక్టర్లు తాము ఏమీ చేయలేమని పట్టణంలోని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా తెలిపారు.

కాగా వృద్ధురాలి పరిస్థితి విషమంగా ఉంది. పిచ్చి కుక్కను తరిమే క్రమంలో కుక్క వెళుతూ జర్ల కాంచమ్మ (50), మూడు పశువులని గాయపరిచింది. కుక్కని తరుముతూ గ్రామ శివారులోకి తీసుకువెళ్లి గ్రామస్తులు చంపినట్లు తెలిపారు. కుస్థాపూర్ గ్రామంలో చనిపోయిన జంతుల కళేబారాలను ఊరికి అతి చేరువలో వేయడం వల్లనే మాంసకృత్తులకి అలవాటు పడి పిచ్చి కుక్కగా మారి దాడి చేసినట్లు అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. జంతు కళేబరాలను పూడ్చిపెట్టకుండా గ్రామానికి చేరువలో రోడ్డుపక్కనే వేయడంతో ఆ జంతు కళేబరాలను తిన్న కుక్కలకు పిచ్చి లేసింది కావచ్చని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు. పలుమార్లు గ్రామస్తులు జంతు కళేబరాలను గ్రామానికి చేరువలో వేయకూడదని, పూడ్చి పెట్టాలని పలువురు విద్యావంతులు తెలిపినప్పటికీ గ్రామంలోని కొందరు అక్కడే వేయడం వల్ల కుక్కలకి ఆహారంగా మాంసకృత్తులు దొరకడంతో పిచ్చికుక్కలా మారుతున్నాయని అంటున్నారు. ఇలా గ్రామంలో 50 కి పైగా కుక్కలు తిరుగుతున్నాయని వాటి వలన గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నామని మోర పెట్టుకున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోయారు. ఇప్పటికైనా పిచ్చి కుక్కల బెడద నుండి కాపాడాలని గ్రామస్తులు కోరారు.



Next Story

Most Viewed