శివన్నమస్మరణతో మార్మోగుతున్న వేములవాడ ప్రాంతం

by Dishanational1 |
శివన్నమస్మరణతో మార్మోగుతున్న వేములవాడ ప్రాంతం
X

దిశ, కోనరావుపేట: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం మహా శివరాత్రి వేడుకలకు సర్వం సిద్ధమైంది. శివనామ స్మరణతో వేములవాడ ప్రాంతం అంత మార్మోగుతోంది. జాతర ఏర్పాట్లతో వేములవాడ పట్టణం నూతన శోభను సంతరించుకుంది. మంత్రి కె. తారక రామారావు మార్గదర్శనం మేరకు వేడుకలకు వచ్చే భక్తులకు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి నేతృత్వంలో అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి వేములవాడలో మూడు రోజుల పాటు మహా శివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేయడంతో ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు.


ఆలయాన్ని విద్యుత్తు కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయడంతో రాత్రి సమయంలో ఆలయ పరిసరాలు విద్యుత్‌ కాంతులతో వెలిగిపోతున్నాయి. ధర్మగుండంలో కొత్త నీటిని నింపడమే కాకుండా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రధాన రహదారుల వెంబడి స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. పార్కింగ్‌ స్థలం వైపు నుంచి ధర్మగుండానికి కొత్తగా గేట్లు పెట్టడమే కాకుండా.. జాతరకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను వివిధ డిపోల నుంచి నడుపుతున్నారు.


భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్‌ నుంచి కట్ట కింద బస్టాప్‌ వరకు 14 ఉచిత బస్సులను నడుపుతున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తులు జాగరణ చేసేందుకు పెద్ద ఎత్తున చలువ పందిళ్లు, షామియానాలు వేశారు. పార్కింగ్‌ స్థలంలో తాత్కాలిక మరుగుదొడ్లు, జల్లు స్నానాలకు నల్లాలు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా మొబైల్‌ మూత్రశాలలను ఏర్పాటు చేశారు. క్యూలైన్లలోని భక్తులకు శుద్ధజలం, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లను విద్యుత్‌ దీపాలతో సుందరీకరించారు.


ఆకట్టుకుంటున్న శివార్చన కార్యక్రమాలు


వేములవాడ గుడిచెరువులో రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ అధ్వర్యంలో ఏర్పాటు శివార్చన కార్యక్రమాన్ని శుక్రవారం రాత్రి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేనీ రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి లతో కలిసి ప్రారంభించారు. ఈ శివార్చన కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వందలాది కళాకారులు ప్రదర్శిం చిన ఒగ్గుడోలు, శాస్త్రీయ సంగీత నృత్య ప్రదర్శనలు,జానపద కళాప్రదర్శనలు,కోలాటాలు,ఒగ్గుడోలు ప్రదర్శనలు భక్తులందరిని విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేనీ రమేష్ బాబు మాట్లాడుతూ..... మంత్రి కె. తారక రామారావు సంపూర్ణ సహకారంతో వేములవాడలో మహాశివరాత్రి జాతరను కన్నుల పండువగా నిర్వహిస్తున్నామనీ చెప్పారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నాక రూ. 20-30 కోట్లతో వేములవాడ నియోజకవర్గంలోనే చిన్న దేవాలయాల అభివృద్ధికి వెచ్చించడం జరిగిందన్నారు. వేములవాడ ప్రాంతం కళలకు పుట్టినిల్లు అని, సినారె పుట్టిన గడ్డని పేర్కొన్నారు. వేములవాడ వెన్నెల వాడగా ప్రసిద్ధం కాబడ్డ ఈ ప్రాంతంలో సాంస్కృతిక కార్యక్రమాలు గొప్పగా జరగడం ఆనందంగా ఉందన్నారు.


మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కు వేములవాడ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలోనే గుడి చెరువును ముందుకు జరిపి 35 ఎకరాల స్థలాన్ని పార్కింగ్, సాంస్కృతిక కార్యక్రమాలకు అనువుగా మార్చారు. భాషా సాంస్కృతిక ఆధ్వర్యంలో చేపట్టిన శివార్చన కార్యక్రమం చాలా గొప్పగా ఉందన్నారు.

Next Story

Most Viewed