ఎండల ఉధృతికి పశుపక్షాదుల విలవిల

by Ratna Kumari |

రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

ఎండల ఉధృతికి పశుపక్షాదుల విలవిల
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : రాష్ట్రంలో గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. భానుడి భగభగలకు కొన్ని ప్రాంతాలలో వడదెబ్బ తగిలి జనం మరణిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన వడగాల్పుల తీవ్రతకు కేవలం మనుషులే కాకుండా పశుపక్షాదులు కూడా ప్రాణాలు విడుస్తుండటం కలిచివేస్తోంది. హుజూరాబాద్ మండల పరిధిలోని బోర్నపల్లి శివారులో గురువారం ఎండ తీవ్రతను తట్టుకోలేక రామచిలుకలు రోడ్డుపైనే సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు విడుస్తున్నాయి. అంతేకాకుండా ఎండ వేడిమికి తాళలేక పిచ్చుకలు సైతం అక్కడక్కడా మృతి చెందుతున్నాయి.

మానవత్వం చాటుకుందాం.. ​జంతు ప్రేమికుల విజ్ఞప్తి

ప్రస్తుతం నడుస్తున్న తీవ్రమైన ఎండల నేపథ్యంలో మూగజీవాల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జంతు ప్రేమికులు, మానవతావాదులు కోరుతున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, బాల్కనీలలో ఇంటి సమీపంలో పశుపక్షాదులు తాగేందుకు వీలుగా నీటి పాత్రలను ఏర్పాటు చేయాలని, తద్వారా ఈ వేసవిలో మూగజీవాల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గుట్టల ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు సైతం జంతువులకు, పక్షులకు నీటి సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.

Next Story