పంచాయతీ నిధుల మళ్లింపు కుట్రపూరితం: శోభరాణి

by Dishanational1 |
పంచాయతీ నిధుల మళ్లింపు కుట్రపూరితం: శోభరాణి
X

దిశ, పెగడపల్లి: గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా దారి మళ్ళించడం అనేది కుట్రపూరితం అని, మళ్లించిన నిధులను వెంటనే పంచాయతీల ఖాతాల్లోకి జమ చేయాలని జిల్లా పంచాయతీ ఛాంబర్ అధ్యక్షురాలు, బతికేపల్లి గ్రామ సర్పంచ్ తాటిపర్తి శోభరాణి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సర్పంచులతో కలిసి ఎంపీడీఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయితీలకు చెల్లించాల్సిన బకాయిల కోసం నాలుగు నెలల ముందు చెక్కులు జమ చేయగా వాటిని రద్దు చేసి, 15వ ఆర్థిక సంఘం నిధుల నుండి జమ చేయడం కోసం మళ్ళీ చెక్కులను వేయమనడం అన్యాయం అని, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల ఒత్తిడితో గ్రామాల్లో అభివృద్ధి పనులను అప్పులు చేసి మరీ పూర్తి చేశామని, ఇపుడు వాటికి మిత్తీలు కూడా కట్టలేని స్థితిలో సర్పంచులు ఉన్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను విడుదల చేయాలని, అదేవిధంగా మళ్లించిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఖాతాల్లో జమ చేయాలని.. లేదంటే పెద్ద ఎత్తున సర్పంచులు అందరూ పోరాటం చేస్తారని హెచ్చరించారు. ఈ నిరసనలో సర్పంచులు ఈరెల్లి శంకర్, గోలి మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story