బ్రేకింగ్ న్యూస్.... ప్రజలకు కీలక హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి

by Gopi |
బ్రేకింగ్ న్యూస్.... ప్రజలకు కీలక హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి
X

దిశ, హుజూరాబాద్: తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియమ్మదేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలపై ఆయన తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. హథ్ సే హథ్ జోడో యాత్ర బుధవారం రాత్రి హుజూరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధికి ఇక్కడి ప్రజలు రుణపడి ఉండాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అవినీతి అక్రమాలపై స్పందించడం లేదంటే ఈటల, కేసీఆర్ ఇద్దరు కూడా తోడు దొంగలేనని అర్థమవుతుందన్నారు. మాట మాటకు కేసీఆర్ ను జైల్లో పెడుతానన్న బీజేపీ స్టేట్ చీఫ్ ఎపుడు ఆ పని చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన అనేక బిల్లులకు మద్దతు పలికింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ సరఫరా ఎక్కడ చేస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

స్థలాలు ఉండి ఇండ్లు లేని అర్హులందరికీ రూ. 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తామని ప్రకటించారు. 10 నెలల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో రాబోయేది ఇందిరమ్మ రాజ్యమేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బల్మూరి వెంకట్ ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదేనన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ హుజూరాబాద్ ను పీవీ జిల్లా ఎందుకు చేయలేదో చెప్పాలని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలబడే వ్యక్తినే ఆశీర్వదించండన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెరిగిన ధరలను నియంత్రిస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలేమయ్యాయని హరీష్ రావు ను ఈ సమావేశంలో మాజీ ఎంపీ ప్రభాకర్ గౌడ్ ప్రశ్నించారు. వెంకట్ మాట్లాడుతూ మీ ఇంటి బిడ్డగా ఉంటానని తనను ఆశీర్వదించాలని కోరారు.

కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, సిరిసిల్ల రాజయ్య, డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ బల్మూర్ వెంకట్, మాజీ ఎమ్మెల్యేలు వేముల నరేందర్ రెడ్డి, విజయ రమణారావు, సొల్లు బాబు తదితరులు పాల్గొన్నారు.

Next Story