రాజకీయంగా బీఆర్ఎస్ మట్టి కొట్టుకపోవడం ఖాయం: మాజీ ఎంపీ మధుయాష్కీ

by Disha Web Desk 1 |
రాజకీయంగా బీఆర్ఎస్ మట్టి కొట్టుకపోవడం ఖాయం: మాజీ ఎంపీ మధుయాష్కీ
X

జీవన్ రెడ్డి ఓటమిపై అనుమానాలు.. ధర్మపురి రీకౌంటింగ్ లో లక్ష్మణ్ దే విజయం

దిశ, జగిత్యాల ప్రతినిధి: రాజకీయంగా బీఆర్ఎస్ మట్టి కొట్టుకపోవడం ఖాయమని నిజామాబాద్ మాజీ ఎంపీ, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ సంచలన వాఖ్యలు చేశారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మధుయాష్కి అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎందరో యువకుల బలిదానాలతో, తెలంగాణ వాదంతో సాధించుకున్న రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని అన్నారు.

యువతకు ఉద్యోగాలు లేక రాష్ట్రంలో విచ్చలవిడిగా ఏర్పడిన బెల్ట్ షాపుల్లో మద్యానికి బానిసై తండ్రులు సంపాదించిన ఆస్తులను, భార్యల మెడలో పుస్తెలు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ముసుగులో బతక నేర్చిందని రూ.కోట్ల అవినీతి చేసిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కవితని ఎంపీగా గెలిపించి, ఇపుడు ఎమ్మెల్సీ అయితే ఒక ఆడబిడ్డ అయి ఉండి లిక్కర్ దందా చేస్తూ దొరికి రాష్ట్ర ఆడపడుచుల పరువు తీసిందని ఎద్దేవా చేశారు.

లిక్కర్ స్కాం విషయంలో ఎలాంటి తప్పు చేయకుంటే సుప్రీం కోర్టును ఎందుకు ఆశ్రియించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి ఈవీఎంలను మేనేజ్ చేసి ధర్మపురి, జగిత్యాల ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని అనుమానం వ్యక్తం చేశారు. ధర్మపురి అభ్యర్థిగా పోటీ చేసిన లక్ష్మణ్ కుమార్ గెలిచినట్లు వార్తలు వచ్చాయని కానీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్పటి కలెక్టర్, రిటర్నింగ్ అధికారి ఫలితాల్ని తారుమారు చేసి రీకౌంటింగ్ చేయకుండా ఏకపక్షంగా వ్యవహరించి కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ప్రకటించారని ఆరోపించారు.

లక్ష్మణ్ కుమార్ చేస్తున్న పోరాటానికి మద్దతు ఉంటుందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు స్ట్రాంగ్ రూం తెరిచి విచారణ చేయాల్సి ఉండగా స్ట్రాంగ్ రూం తాళం చెవులు లేవని చెప్పడం అంటే దాని వెనక బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర ఉందని తొందరలోనే హైకోర్టు ఆదేశాల మేరకు రీ కౌంటింగ్ జరిగి తమ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ గెలుస్తాడు అని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఎక్కడైతే తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందో అక్కడ ఈవీఎంలను మేనేజ్ చేస్తారని ఆరోపించారు.

ఏ తెలంగాణ వాదంతో అయితే రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తమ పార్టీ పేరులో నుంచి తెలంగాణ అనే పదం తీసేయడం అంటే రాష్ట్ర సాధన కోసం అమరులైన వారి త్యాగాలను అవమానించినట్లే అని అన్నారు. రానున్న రోజుల్లో రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ మట్టి కొట్టుకుపోవడం ఖాయం అని మండిపడ్డారు. ఆయన వెంట ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్, ఇతర కాంగ్రెస్ నాయకులున్నారు.


Next Story

Most Viewed