శనగకుంటను కాపాడాలని ప్రజల విజ్ఞప్తి

by Muthe.Rajitha |

భూ బకాసురుల కబంధ హస్తాల్లో చెరువులు కుంటలు బందీ అవుతున్నాయి.

శనగకుంటను కాపాడాలని ప్రజల విజ్ఞప్తి
X

దిశ, చొప్పదండి: భూ బకాసురుల కబంధ హస్తాల్లో చెరువులు కుంటలు బందీ అవుతున్నాయి. అధికారుల ఉదాసీనతగా వ్యవహరిస్తుండడాన్ని ఆసరా చేసుకొని కబ్జారాయుళ్లు యథేచ్ఛగా కుంటలను ఆక్రమించుకొని పంట పొలాలుగా మార్చుకుంటున్నారు. చొప్పదండి పట్టణం లోని సర్వే నంబర్ 1323 లోగల 47ఎకరాల 16 గుంటలు గల శనగ కుంట ఆక్రమణకు గురైంది. ప్రకృతి సిద్ధంగా ప్రకృతి సంపదగా ఏళ్లుగా శనగ కుంట ఉందని ఇప్పుడు కొన్నేళ్ల కింద ఉన్న హద్దులకు అనుగుణంగా భూమి లేదని,ఈ భూమిపై సర్వే జరిపి హద్దులు నిర్ణయించి ఆక్రమణకు గురి కాకుండా కాపాడాలని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఆక్రమణ జరిగిందని అనుమానం అన్న చోట విచారణ జరిపి అట్టి భూమిని స్వాధీనం చేసుకోవలసిన అధికారులు చర్యలు తీసుకోకపోవడం సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సాగు తాగు నీటికై ఉపయోగ పడవలసిన కుంటలు, చెరువులు అక్రమణకు గురైనప్పుడు కాపాడవలసిన బాధ్యత అధికారులకు లేదా..?అని ప్రశ్నిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం, చూసీ చూడనట్లు వ్యవహరించడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోంది. 47ఎకరాల విస్తీర్ణంలో ఉండవలసిన శనగ కుంట ఆక్రమణకు గురై ప్రస్తుతం సుమారు 3ఎకరాల విస్తీర్ణం కూడా లేకుండా పోయింది. అధికారులు కుంట ఆక్రమణపై చర్యలు తీసుకోకపోతే కుంట ఆనవాళ్లు కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. పట్టణ ప్రజలకు సాగు, తాగు నీరు అందించేందుకు రెవెన్యూ రికార్థుల ప్రకారం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని ఉన్నతాధికారులు ఈ అంశంపై చొరవచూపి శనగకుంటను కాపాడాలని కోరుతున్నారు.

కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

పట్టణంలోని శనగకుంట ఆక్రమణకు గురైంది. పట్టణ ప్రజలకు, భవిష్యత్తు తరాలకు సాగు, తాగు నీరు అందించేందుకు చెరువులు, కుంటలు కాపాడుకునే ఆవశ్యకత ఉంది. కుంటను ఆక్రమణదారుల నుంచి రక్షించి వారిపై చర్యలు తీసుకోవాలి. -మావురపు మహేష్, బీఆర్ఎస్ బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్

సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తా..

పట్టణంలోని శనగకుంటను రెవిన్యూ రికార్థుల ప్రకారం సర్వేయర్ తో కొలతలు చేయించి హద్దులు నిర్ణయిస్తాం. కుంటను ఆక్రమించుకున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటా. -నవీన్ కుమార్, తహసీల్దార్,చొప్పదండి

Next Story