సుడా నిధులతో 72 గ్రామాల అభివృద్ధి: మంత్రి గంగుల

by Web Desk |
సుడా నిధులతో 72 గ్రామాల అభివృద్ధి: మంత్రి గంగుల
X

దిశ, కరీంనగర్ సిటీ: శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) నిధులు రూ.10 కోట్లతో సుడా పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సుడా చైర్మన్ జీవి రామకృష్ణ రావు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్‌లతో కలసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూడా పరిధిలోని కరీంనగర్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్గాల్లోని 72 గ్రామాలను అభివృద్ధి చేయాలని మంత్రి సూచించారు. చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నలువైపుల నుంచి కరీంనగర్‌కు వచ్చే రహదారుల వద్ద ముఖద్వారాలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రధాన రహదారులను శుభ్రంగా ఉంచేందుకు రోడ్లు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. మానకొండూర్ చెరువు వద్ద బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని కోరారు. మానకొండూరు నియోజకవర్గంలోని మైలారం గ్రామంలో ఉన్న గుడిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, మానేరు జలాశయం నుంచి బోటింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. అల్గనూర్ చౌరస్తా నుండి మానకొండూర్ పోలీస్ స్టేషన్ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు.

చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ.. సుడా పరిధిలోని గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. కరీంనగర్‌ను మోడల్ సిటీగా మార్చేందుకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. ముందుగా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థకు సిబ్బంది నియామకాన్ని ప్రకటించారు. కార్యాలయానికి సూపరిండెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ తదితర ఏడుగురు సిబ్బందిని నియామకం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. శాత వాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ జీవి రామకృష్ణ రావు మాట్లాడుతూ.. జిల్లా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రసమయి, రవిశంకర్‌ల సూచన మేరకు సంస్థ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. చారిత్రాత్మక కట్టడమైన ఎలగందుల కోట పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

మానకొండూర్ చెరువు ప్రాంతాన్ని, మైలారం గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మానకొండూరు మండలం గట్టేపల్లిలో ప్రభుత్వ భూమిని అప్పగిస్తే ప్లాంటేషన్ నిర్వహిస్తామన్నారు. వరంగల్, హైదరాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల నుంచి కరీంనగర్‌కు వచ్చే రహదారుల్లో స్వాగత తోరణాలు ఏర్పాటు చేయిస్తామని తెలిపారు. సుడా సంస్థలో ఉన్న రూ.15 కోట్ల నుండి రూ.10 కోట్లు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, సుడా వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, సుడా డైరెక్టర్లు మంద రమేష్ గౌడ్, కామారం శ్యామ్, శైలేందర్ యాదవ్, ఉదరపు మారుతి, రవీందర్ వర్మ, వంగర రవీందర్, సీహెచ్ శోభా, షేక్ యూసుఫ్, సుడా కార్యాలయ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed