మాతా శిశు దావఖాన సిబ్బందికి జీతాలు లేవు...

by Disha Web Desk 20 |
మాతా శిశు దావఖాన సిబ్బందికి జీతాలు లేవు...
X

దిశ, పెద్దపల్లి టౌన్ : రెక్కాడితే కానీ డొక్కాడని వేతన జీవులు జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న వైనం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గల మాత శిశు సంరక్షణ కేంద్రంలో జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో 17కోట్ల రూపాయలతో మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేసి అనతి కాలంలోనే నిర్మాణం చేపట్టి దాని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇంతవరకు బాగానే ఉన్నా నగరం నడిబొడ్డున పెద్దభవనం దానిలో వసతుల కొరకు శుభ్రంగా ఉంచడానికి ఆస్పత్రి సెక్యూరిటీ కొరకు మూడు విభాగాల్లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ పద్ధతిలో 83 మంది సిబ్బందిని తీసుకున్నారు. ఇందులో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ విభాగాల్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు.

వారందరిని గత సంవత్సరంలో రిక్రూట్ మెంట్ చేసుకొని ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జీతాలు ఇవ్వాల్సి ఉంది. కానీ వారిని నియమించుకున్న సదరు కాంట్రాక్టర్ అనేక ఇబ్బందులకు గురిచేస్తూ వారికి వేతనాలు సరిగా చెల్లించడంలేదు. 40 మందికి ఆర్డర్ కాపీలు ఇప్పటివరకు ఇవ్వలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి నెలకు జీతం రూ. 15వేల 600 రూపాయలు పీఎఫ్ ఇతర కట్టింగులు పోగా 12 వేల 194 రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్ ఇప్పటి వరకు కేవలం మూడు నెలల జీతాలు మాత్రమే ఇచ్చి అవికూడా 10వేల రూపాయలకు మించకుండా ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని నెగ్గుకు రావడం కష్టంగా ఉందని ఆ ఇచ్చేజీతాన్ని ఏ నెల జీతం ఆ నెలకు ఇచ్చిన తమ కుటుంబం నడుస్తుందని వేడుకుంటున్నారు. వారి గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అనేక ఇబ్బందులు పడుతున్నారు.

గురువారం కొందరు కార్మికులు బీఎస్పీ నియోజకవర్గ ఇంచార్జ్ దాసరి ఉష ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ కలిసి తమ బాధంతా వెళ్లబోసుకున్నారు. తినేందుకు తిండి లేక కష్టపడుతున్నామని తమ గోడుమీరే తీర్చాలంటూ కలెక్టర్ కు కార్మికులు విన్నవించారు. వేరె గ్రామాల నుండి వచ్చే ఉద్యోగులు కొందరు బైక్ లో పెట్రోల్ పోయించుకొని వచ్చే పరిస్థితి లేక ఇంట్లోనే ఉంటున్నారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవొచ్చు. ఇకనైనా సదరు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకొని తమకు ఆర్డర్ కాపీలతోపాటు పెండింగ్లో ఉన్న 9నెలల జీతాన్ని ఇప్పించాలని ప్రభుత్వంలోని పెద్దలను వారు కోరుతున్నారు. ఈ సమస్య పై ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల స్పందన ఏ విధంగా ఉంటుందో వేచి చూడాలి.



Next Story

Most Viewed