మన లక్ష్యం గొప్పగా ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం

by Dishanational1 |
మన లక్ష్యం గొప్పగా ఉన్నప్పుడే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటాం
X

దిశ, జగిత్యాల రూరల్: జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా 33 లక్షలతో సీసీ రోడ్లు, గీతా పారిశ్రామిక సహకార సంఘం భవనం మిగులు పనులు, మరియు మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో మౌళిక వసతుల అభివృద్ది ద్వారా రూ. 17 లక్షల 95 వేలతో నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. విద్యార్థులు ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కఠోర సాధన చేయాలని, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు అవసరమైన సహాయ, సహకారాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందిస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అదేవిధముగా గ్రామంలోని జిల్లా మండల ప్రజాపరిషత్ పాఠశాలలో రూ. 17.95లక్షలతో మన ఊరు మన బడి కంపొనెంట్ పనులను, ఎన్.ఆర్.జి.ఎస్. క్రింద 61 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , స్థానిక శాసన సభ్యులు సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ లతో కలిసి ప్రారంభించారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ... ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపొందించారని, ఇది సాహోసోపేతమైన నిర్ణయం అని, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనివిధంగా ఇంత గొప్పగా చేస్తున్న దాఖలాలు లేవని మంత్రి అన్నారు. తెలంగాణ రాక పూర్వం పరిస్థితులను బేరీజు వేసుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకుండా విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెసిడెన్షియల్ విద్యా విధానం తీసుకొచ్చిన తర్వాత సమాజంలో వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన పేదలకు విద్యా అవకాశాలు పెరిగాయని, 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు తల్లిదండ్రుల పైభారం పడకుండా కార్పొరేట్ స్థాయి విద్యను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని అన్నారు. మన గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అద్భుత విజయాలను సాధిస్తున్నారని, దేశంలోని ప్రఖ్యాత యూనివర్సిటీలలో సీట్లు వస్తున్నాయని, నీట్, ఐఐటీ వంటి అనేక పోటీ పరీక్షలలో నెగ్గుకొస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.

మన లక్ష్యం గొప్పగా ఉన్నప్పుడే మనం జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని, విద్యార్థులంతా మంచి స్థాయికి చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎల్లా రాజనర్సు రాజన్న, ఉపసర్పంచ్ పద్మతిరుపతి, రూరల్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఏఎంసీ చైర్మన్, వార్డు సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed