ఒక్కో ట్యాబ్ విలువ రూ. 86 వేలు.. మీకు వీటిని ఫ్రీగా ఇస్తున్నాం... బాగా చదువుకోండి

by Dishanational1 |
ఒక్కో ట్యాబ్ విలువ రూ. 86 వేలు.. మీకు వీటిని ఫ్రీగా ఇస్తున్నాం... బాగా చదువుకోండి
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం "గిఫ్ట్ ఏ స్మైల్" కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మాట ఇచ్చిన మేరకు సిరిసిల్లలో 1000 ట్యాబ్ లు ఇచ్చామని.. ఎల్లారెడ్డిపేటలో మరో 2 వేల ట్యాబ్ లను ఇస్తున్నామని.. వేములవాడ నియోజకవర్గ విద్యార్థులకు 3 వేల ట్యాబ్ లను ఉచితంగా అందజేస్తా్మన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజేతలుగా నిలిచి రాజన్న సిరిసిల్ల జిల్లా పేరు నిలబెట్టాలి అన్నారు.

ఈ ట్యాబ్‌ల‌ను స‌మ‌ర్థవంతంగా ఉప‌యోగించుకోవాల‌ని కేటీఆర్ సూచించారు. చ‌దువుల కోసం వాడండి.. ఇందులో ఇంట‌ర్నెట్ పెట్టి ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్ పెట్టి అడ్డమైన కార్యక్రమాలు చేయ‌కండి.. అంటే వాటితో టైం వేస్ట్ చేయ‌కండి.. వేరే విష‌యం కాదు.. మంచిగా చ‌దువుకుని ఐఐటీ, నీట్ ఎంట్రెన్స్‌ల‌తోపాటు ఇత‌ర రంగాల్లో మంచి ర్యాంకులు సాధించండి.. ప్రప‌ంచంతో పోటీ ప‌డే పౌరులుగా త‌యారు కావాల‌నే ఉద్దేశంతోనే మీకు ఈ ట్యాబ్‌లు అంద‌జేస్తున్నాం.. వేముల‌వాడ నియోజ‌క‌వ‌ర్గానికి కూడా తప్పకుండా 3 వేల ట్యాబ్‌లు అందిస్తాం.. రాష్ట్ర, దేశ స్థాయిలో మంచి ర్యాంకులు సాధిస్తే త‌మ‌కు తృప్తి క‌లుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.


ఒక్కో ట్యాబ్ విలువ రూ. 86 వేలు....

గిఫ్ట్ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా చిన్నారి త‌మ్ముళ్లు, చెల్లెళ్ల ముఖాల్లో చిరున‌వ్వులు చూడాల‌ని ఆకాష్ బై జూస్ సాఫ్ట్‌వేర్ ట్యాబ్‌ల‌ను విద్యార్థులకు అందజేస్తున్నామని అని కేటీఆర్ తెలిపారు. ఈ ట్యాబ్‌ల ద్వారా పోటీ ప‌రీక్షల‌కు ఉప‌యోగప‌డే మెటిరీయ‌ల్‌ను అంద‌జేస్తున్నాం.. బ‌య‌ట కంటే ఈ ట్యాబ్ విలువ రూ. 10 వేలు అవుతుంది.. మెటిరీయ‌ల్ విలువ రూ. 75 వేలు అవుతుంది.. అంటే ఒక్కో ట్యాబ్ విలువ రూ. 86 వేలు.. దీన్ని ఉచితంగా మీ చేతుల్లో పెడుతున్నాం.. మీరు బాగా చ‌దువుకుంటే.. మేమంతా సంతోష‌ప‌డుతాం.. గ‌ర్వప‌డుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

కార్పొరేట్ పాఠ‌శాల‌ల కంటే మిన్నగా ప్రభుత్వ పాఠ‌శాల‌లు

ఎల్లారెడ్డిపేట పాఠ‌శాల రూ. 7 కోట్లతో అద్భుతంగా త‌యారవుతోంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయే 2, 3 నెల‌ల్లోనే ఆ పాఠ‌శాల‌ను ప్రారంభిచుకుందాం అని చెప్పారు. పాఠ‌శాల గొప్పగా త‌య‌ర‌వుతోంది. కానీ జూనియ‌ర్ కాలేజీ గ్రౌండ్ అనుకున్నట్టు లేదు.. ఈ గ్రౌండ్‌ను మినీ స్టేడియంగా తీర్చిదిద్దుతాం అని స్పష్టం చేశారు. వేణుగోపాల స్వామి ఆల‌యాన్ని రూ. 2 కోట్లతో స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దుతాం అని చెప్పారు. మొత్తం మ‌న జిల్లాలోని పాఠ‌శాల‌ల‌ను రాష్ట్రానికే ఆద‌ర్శంగా తీర్చిదిద్దుతున్నాం.. కార్పొరేట్ పాఠ‌శాల‌ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చిదిద్దబోతున్నాం అని పేర్కొన్నారు. మ‌న ఊరు మ‌న బ‌డి కార్యక్రమం కింద‌ గంభీరావుపేట‌లో కేజీ టు పీజీ క్యాంప‌స్‌ను ప్రారంభించుకున్నాం.. రాబోయే రోజుల్లో 26 వేల ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను అద్భుతంగా తీర్చిదిద్దడంతోపాటు ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న అందిస్తామ‌న్నారు.

విద్యా వ్యవ‌స్థలో మార్పులు తీసుకువ‌స్తున్నాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. అనంతరం వయోవృద్ధుల కేంద్రాన్ని ప్రారంభించారు. రూ. 40 లక్షలతో అన్ని వసతులు, 25 బెడ్లతో సంరక్షణ సదుపాయాలను ఉన్నాయన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లి గ్రామపంచాయతీని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణా రాఘవ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, డీఐజీ రమేష్ నాయుడు, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా విద్యాధికారి ఎ రమేష్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






Next Story

Most Viewed