కేసీఆర్.. తాటాకు చప్పుళ్లకు బీజేపీ ఎన్నటికీ భయపడదు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

by Disha Web Desk 1 |
కేసీఆర్.. తాటాకు చప్పుళ్లకు బీజేపీ ఎన్నటికీ భయపడదు: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
X

టీ.ఎస్.పీ.ఎస్.సీ పేపర్ లీకేజీ విషయాన్ని దారి మళ్లించే యత్నం

దిశ, కరీంనగర్: తాటాకు చప్పుళ్లకు బీజేపీ ఎన్నటికీ భయపడదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కుట్రపూరితంగానే ఎంపీ బండి సంజయ్ ని అరెస్ట్ చేసి అక్రమ కేసులు పెట్టారని ఆయన అన్నారు. బండి సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ కోర్టు చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పై కుట్ర పూరితంగా కేసు నమోదు చేసినట్లు స్పష్టంగా కనబడుతోందన్నారు.

కేసు పూర్వాపరాల్లో అనేక అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అక్రమంగా బండి సంజయ్ పై కేసు నమోదు చేయించి, అర్థరాత్రి అరెస్టు చేసి జైలుకు తరలించడం అప్రజాస్వామ్యమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రజా పోరాటాలు చేస్తున్న బండి సంజయ్ కుమార్ పనితీరు ప్రభుత్వం జీర్ణించుకోలేక అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్.. తాటాకు చప్పుళ్లకు బీజేపీ ఎన్నటికీ భయపడదని అన్నారు.

అక్రమ కేసులతో వేధించాలనుకుంటే బీఆర్ఎస్ కు త్వరలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రశ్నించే గొంతుకలను పార్టీలను అణగదొక్కడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. అదేవిధంగా బీజేపీ వ్యతిరేక కూటమికి తనను చైర్మన్ గా చేస్తే దేశ వ్యాప్తంగా రాబోయే ఎన్నికల్లో పూర్తి ఖర్చు తానే భరిస్తానని సీఎం కేసీఆర్ ఆఫర్ చేసిన విషయం చర్చనీయాంశంగా మారిందన్నారు. ఈ రకంగా ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిన నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ప్రజల దృష్టిని మరల్చేందుకు అక్రమ అరెస్టుల మార్గాన్ని ఎంచుకోవడం సిగ్గు చేటన్నారు.

బండి సంజయ్ పై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకుని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని, లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, గుగ్గిళ్లపు రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కళ్లెం వాసుదేవ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు, మేకల ప్రభాకర్ యాదవ్, బండ రమణారెడ్డి, పుప్పాల రఘు, బల్బీర్ సింగ్, సంకిటి శ్రీనివాస్ రెడ్డి, సోమిడి వేణు, నాగసముద్రం ప్రవీణ్, ఆవుదుర్తి శ్రీనివాస్, నరహరి లక్ష్మారెడ్డి, పాదం శివరాజ్, సుగుర్తి జగన్, వరాల జ్యోతి, పుల్లెల పవన్, తదితరులు పాల్గొన్నారు.

Next Story