సకాలంలో డబ్బు చెల్లించక పోతే చర్యలు తప్పవు...

by Disha Web Desk 20 |
సకాలంలో డబ్బు చెల్లించక పోతే చర్యలు తప్పవు...
X

దిశ, కరీంనగర్ : కరీంనగర్ కమిషనర్ కేంద్రంలో ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమాన్య ప్రతినిధులతో గురువారం నాడు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎల్.సుబ్బరాయుడు మాట్లాడుతూ గడువు ముగిసిన, అవసరమైన సమయాల్లో చిట్ గ్రూప్ లోని సభ్యులకు సకాలంలో డబ్బు చెల్లించట్లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోసం చిట్ ఫండ్ సంస్థలను నమ్మి, డబ్బులు కూడపెట్టుకుంటారని అవసరానికి వారికి అందించకుండా పలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. కొన్ని సంస్థలు ఏకంగా డబ్బుకు బదులు తక్కువ ధర గల భూములను ఎక్కువగా చూపిస్తూ బలవంతపు రిజిస్ట్రేషన్ చేయించి గ్రూప్ సభ్యులకు కట్టబెడుతున్నారని తెలిసిందన్నారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేంత వరకు కరీంనగర్ పోలీసులు బాధితుల వెంట ఉంటామని తెలిపారు.

అన్ని ప్రైవేట్ చిట్ ఫండ్ యాజమాన్యాలకు వారం రోజులు గడువు ఇస్తున్నామని ఈలోగా వారి సంస్థల పూర్తి వివరాలను కోరిన విధంగా అందజేయాలని తెలిపారు. ఆ వివరాల ఆధారంగా పూర్తిస్థాయిలో విచారణ చేపడతామన్నారు. విచారణ అనంతరం సమావేశం నిర్వహిస్తామని దానికి అన్నియాజమాన్యాలు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. ప్రైవేట్ చిట్ ఫండ్ సంస్థలకు తాము వ్యతిరేకం కాదని చట్టపరిధిలో పరిమితులకు లోబడి వ్యాపారం చేసుకోవాలని సూచించారు. పరిమితులను ఉల్లంఘించిన లేదా గ్రూపు సభ్యులకు సకాలంలో డబ్బు చెల్లించక ఇబ్బందులకు గురిచేసే సంస్థల యాజమాన్యాలకు కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ప్రసన్న, చిట్ రిజిస్ట్రార్ దిలీప్ చంద్ర గోపాల్, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, పలు చిట్ ఫండ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed