సాలు దొర.. సెలవు దొర పక్కా: JP Nadda

by Dishanational1 |
సాలు దొర.. సెలవు దొర పక్కా: JP Nadda
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: సాలు దొర.. సెలవు దొర పక్కా అంటూ సీఎం కేసీఆర్ పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ లో ఐదవ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ముగింపు సభకు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. రాజరాజేశ్వరి మాత, కొండగట్టు హనుమాన్ ల ఆశీర్వాదం తీసుకుని, మాట్లాడుతా. ఒక మంచి ఎంపీ బండి సంజయ్ మీకు దొరికాడా లేడా?. పాదయాత్ర 1403 కిలో మీటర్లు పూర్తి చేసుకుని, ఇక్కడికి వచ్చింది. ఇక్కడితో ఆగేది కాదు ఈ యాత్ర. ప్రజల గోస... బీజేపీ భరోసా. సాలు దొర.. సెలవు దొర పక్కా.

నేను వచ్చేటప్పుడు నా పర్యటనను కూడా ఆపే ప్రయత్నం చేశారు. కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు చెత్తకుప్పలో వేశారు. కేసీఆర్ ప్రభుత్వం 'అవినీతి, అరాచక, ప్రజా వ్యతిరేక' ప్రభుత్వం. కేసీఆర్ పాలనకు గుడ్ బై చెప్పాల్సిందే. సబ్ కా సాత్.. సబ్ కా విశ్వాస్ అన్నది మోడీ పాలనలోనే జరిగింది. ఎస్టీ మహిళ దేశ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా అనుకున్నారా?. కేంద్రం నుంచి జాతీయ రహదారుల కింద భారీ ఎత్తున నిధులు మంజూరు చేశాం. జల్ జీవన్ మిషన్ కింద భారీగా నిధులు ఇచ్చాం. మిగులు రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చాడు. కేసీఆర్ పాలనలో 3.29 కోట్ల అప్పుల కుప్పగా మారింది. కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ... స్వర్గానికి ఎగిరినట్టుంది. కేసీఆర్ బిడ్డ కవిత అవినీతిలో కూరుకుపోయింది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీ... నెక్స్ట్ వీఆర్ఎస్ గా మారక తప్పదు. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్... ఆ హామీని నిలబెట్టుకున్నాడా?. తెలంగాణ ఆదాయాన్ని, వనరులను కేసీఆర్ లూఠీ చేస్తున్నాడు. ధరణి పోర్టల్" పేరుతో... బీఆర్ఎస్ నేతలు పేదల భూములను గుంజుకుంటున్నారు. ఓవైసీకి భయపడే..సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవం గా కేసీఆర్ జరపడం లేదు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా బీజేపీ జరిపింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇచ్చాడా?. కేజీ టు పీజీ ఏమైంది?.

వెల్నెస్ సెంటర్ల పేరును బస్తీ దవాఖానగా మార్చి నడిపిస్తున్నారే తప్ప, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవు. వెల్నెస్ సెంటర్ లకు బస్తీ దవాఖానాలకు నక్కకు, నాగ లోకానికి ఉన్న తేడా ఉంది. బస్తీ దవాఖానాల్లో కనీస సదుపాయాలు కూడా లేవు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేర్చలేదు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే... ఇక్కడ బీజేపీ అధికారంలోకి రావాలి'

'తెలంగాణ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ... బీజేపీతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా. బీజేపీ పాదయాత్రలు ఆగవు... పాదయాత్రలు ఇంకా కొనసాగుతాయి. ప్రతి గడపను చేరి, ప్రజలకు భరోసా కల్పిస్తాయి. తెలంగాణలో కేసీఆర్ పాలనను ప్రజలు బొందపెట్టడం ఖాయం.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. జై తెలంగాణ... జై భారత్' అంటూ జేపీ నడ్డా తన ప్రసంగాన్ని ముగించారు.


Next Story

Most Viewed