విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం తగదు : బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణి

by Ratna Kumari |   (  Updated:2026-04-30 13:19:47  IST  )

కేంద్రీయ విద్యాలయానికి 15 రోజుల్లోపు స్థలం కేటాయించాల‌ని బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో కలిసి మే 15న నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు.

విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం తగదు : బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : కేంద్రీయ విద్యాలయానికి 15 రోజుల్లోపు స్థలం కేటాయించాల‌ని బీజేపీ రాష్ట్ర నాయకురాలు భోగ శ్రావణి డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో కలిసి మే 15న నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. జగిత్యాల ప్రెస్ క్లబ్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌తో నాయకులు చెలగాటం ఆడకూడదని ఈ విషయంలో జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ జోక్యం చేసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకు నవోదయ, కేంద్రీయ‌ విద్యాలయాలను మంజూరు చేసిందని తెలిపారు.


కోరుట్లలో నవోదయ విద్యాలయం ఇప్పటికే ప్రారంభమై ఏడాది పూర్తయిందని గుర్తుచేశారు. జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామంలో 10 ఎకరాల స్థలం కేటాయింపులో ఎమ్మెల్యే ఆలస్యం చేయడం దురదృష్టకరమన్నారు. నిజామాబాద్, వనపర్తి జిల్లాల్లో ఇప్పటికే స్థల కేటాయింపులు జరిగాయని, జగిత్యాలలో మాత్రం నిర్లక్ష్యం ఎందుకని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రీయ‌ విద్యాలయం ఏర్పాటుతో విద్యార్థుల భవిష్యత్‌తో పాటు ప్రాంత అభివృద్ధి కూడా సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరిబాబు, పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, ప్రధాన కార్యదర్శి ఆముద రాజు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story