ఇందిర‌మ్మ ఇళ్ల కోసం డ‌బ్బులు వ‌సూలు చేస్తే.. క్రిమిన‌ల్ కేసులు న‌మోదు

by Ratna Kumari |

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు.

ఇందిర‌మ్మ ఇళ్ల కోసం డ‌బ్బులు వ‌సూలు చేస్తే.. క్రిమిన‌ల్ కేసులు న‌మోదు
X

దిశ, మంథని : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి మంథని లోని శివ కిరణ్ గార్డెన్స్ లో మంథని నియోజకవర్గ పరిధిలోని సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, అంగన్ వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు, గ్యాస్ స్టౌ పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల‌ లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వ పాలన వచ్చిందని, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల వ్యవధిలో మహాలక్ష్మి పథకం క్రింద డిసెంబర్ 9 నుంచి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ప్రారంభించామని, ఇప్పటి వరకు 290 కోట్ల పైగా జీరో టికెట్స్ మహిళలకు జారీ చేయడం జరిగిందని, మహిళలు 10 వేల కోట్లకు పైగా డబ్బులు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆధార్ చేసుకున్నారని మంత్రి తెలిపారు.

మంథని డిపో నుంచి మహిళలు చేసిన ఉచిత ప్రయాణాల వల్ల దాదాపు 67 కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని తెలిపారు. నేడు అంగ‌న్ వాడీ టీచర్లకు సెల్ ఫోన్, గ్యాస్ స్టవ్ లను పంపిణీ చేస్తున్నామని అన్నారు. సెల్ ఫోన్ ద్వారా సాంకేతికతంగా మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిర్ణీత కాలంలో పనులు పూర్తయ్యే విధంగా కలెక్టర్ ప్రత్యేక చూపాలని మంత్రి సూచించారు. మే నెల తర్వాత మరో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి సంవత్సరం 3500 ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని అర్హులైన చివరి లబ్ధిదారుడి వరకు ఇందిరమ్మ ఇండ్లు చేరుతాయని మంత్రి తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ఎవరైనా రూపాయి వసూలు చేయాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కు బిల్లులు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని, ఇంటి నిర్మాణ పురోగతి ఆధారంగా బిల్లుల చెల్లింపు చేయడం జరుగుతుందని, ఎటువంటి సిఫార్సు నడువదని ఎవరికి ఇవ్వవద్దని మంత్రి పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరమే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేసామని అన్నారు. నిరుద్యోగ యువత కోసం గ్రూప్ 1 , గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ , విద్యా,వైద్య, ఇంజనీరింగ్, సంక్షేమ శాఖలో వివిధ పరీక్షలు విజయవంతంగా నిర్వహించి 70 వేలకు పైగా నియామక పత్రాలు పంపిణీ చేశామని అన్నారు.


గత పాలకుల హయాంలో వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘాలకు ఒక్క రూపాయి కూడా రాలేదని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెగ్యులర్గా మహిళా సంఘాలకు వడ్డీ సొమ్ము పంపిణీ చేస్తున్నామని అన్నారు. మహిళా సాధికారత లక్ష్యంగా నేడు పెద్దపల్లి లో వీ-హబ్ ప్రారంభించడం జరిగిందని అన్నారు.పిల్లలకు అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలతో చదువుకోవాలనే లక్ష్యంతో అడవి సోమనిపల్లిలో 200 కోట్ల రూపాయల తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తున్నామని అన్నారు. పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కూడా అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ బాగు చేస్తూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ... ప్రమాదాలు జరిగిన సంఘంలో చాలా మంది బాధితులను ఆసుపత్రిలో జాయిన్ చేయడానికి ముందుకు రావడం లేదని, దీనిని నివారించేందుకు ప్రభుత్వం రహ వీర్ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందని, ప్రమాదం జరిగినప్పుడు బాధితులను గోల్డెన్ అవర్ లో ఆసుపత్రిలో జాయిన్ చేస్తే 25 వేల రూపాయల ప్రోత్సాహకం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేస్తే చికిత్స కోసం లక్షన్నర వరకు ప్రభుత్వం చెల్లిస్తుందని కలెక్టర్ తెలిపారు. ‌అంతకు ముందు మంథని పట్టణంలో 32 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో చేపట్టిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల జె.బి.ఎస్ రిన్నోవెషన్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రాం రెడ్డి, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story