మంచి పనైతే మనది.. చెడు జరిగితే అధికారులదా : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

by Disha Web Desk 1 |
మంచి పనైతే మనది.. చెడు జరిగితే అధికారులదా : పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
X

మాస్టర్ ప్లాన్ కర్త, కర్మ, క్రియ ఎమ్మెల్యే కాదా..

యావర్ రోడ్డు విస్తరణ ఎందుకు చేయట్లేదు..

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల మాస్టర్ ప్లాన్ విషయంలో ఎమ్మెల్యే కర్త, కర్మ, క్రియగా ఉండి అధికారుల నిర్లక్ష్యం, పొరపాటు వల్ల రద్దు చేస్తున్నారని చెప్తున్న ఎమ్మెల్యే మంచి జరిగితే తమది.. అని చెడు జరిగితే అధికారులను భాద్యుల్ని చేస్తారా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. స్థానిక ఇందిరా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్ జీవో ఉపసంహరణను స్వాగతిస్తున్నామని అన్నారు. జీవో ఉపసంహరణ తాత్కాలిక అయినా.. భవిష్యత్తులో సమీక్షిస్తామని జీవోలో స్పష్టం చేశారని గుర్తు చేశారు.

మాస్టర్ ప్లాన్ ఉపసంహరణ కోసం మే 8న ప్రభుత్వానికి విన్నవించి, మే 28 న మాస్టర్ ప్లాన్ ఉపసంహరణ జీవో జారీ చేయించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రెండు సంవత్సరాల క్రితం యావర్ రోడ్డు విస్తరణ కోసం ఉత్తర్వులు జారీ చేసిన నేటికీ విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో రోడ్డు విస్తరణ ప్రధాన అంశంగా చర్చకు లేవనెత్తి నాలుగేళ్లు గడుస్తున్నా.. న్యాయస్థానం పరిశీలనలో ఉందంటూ చెబుతూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. ఆనాడు కూడా న్యాయస్థాన పరిశీలనలోనే ఉందనే విషయం మీకు తెలియదా అని నిలదీశారు.

కోర్టు వివాదంలో ఉన్న రోడ్డు విస్తరణ కోసం మీరు చేపట్టిన చర్యలు ఏంటో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యావర్ రోడ్డు విస్తరణ పనులను ఎందుకు దాట వేస్తున్నారని, రోడ్డు విస్తరణలో మీ సన్నిహితులు ఉన్నారనా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఎలాంటి నష్ట పరిహారం చెల్లించకుండా యావర్ రోడ్డును 40 ఫీట్ల నుంచి 60 ఫిట్ల వరకు విస్తరణ చేపట్టామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎందుకు విస్తరణలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్తే అక్కడ వరాల జల్లు కురిపిస్తున్నాడు కదా.. మరి జగిత్యాల వచ్చినపుడు రూ,100 కోట్ల ప్రకటన చేయిస్తే.. సమస్య పరిష్కారం అయ్యేది కదా అని ఎద్దేవా చేశారు. జరుగుతున్న తతంగం అంతా.. జగిత్యాల ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యుడు గిరి నాగభూషణం, బండ శంకర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, నాయకులు చాంద్ పాషా, పుప్పాల అశోక్, రాధకిషన్, లక్ష్మణ రావు, మహిపాల్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed