​ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఘనత

by Ratna Kumari |

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, పట్టుదలతో శ్రమిస్తే కార్పొరేట్ సంస్థలకు దీటుగా అద్భుతాలు సృష్టించవచ్చని హుజూరాబాద్ మండలం ఇప్పల్ నర్సింగాపూర్ విద్యార్థిని నిరూపించింది.

​ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఘనత
X

దిశ,​ హుజూరాబాద్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, పట్టుదలతో శ్రమిస్తే కార్పొరేట్ సంస్థలకు దీటుగా అద్భుతాలు సృష్టించవచ్చని హుజూరాబాద్ మండలం ఇప్పల్ నర్సింగాపూర్ విద్యార్థిని నిరూపించింది. ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్, బాసర ఐఐఐటీ ఫలితాల్లో ఇప్పల్ నర్సింగాపూర్ ఉన్నత ప్రాథమిక పాఠశాల పూర్వ విద్యార్థిని కళ్లెపు అభినయశ్రీ సీటు సాధించి రికార్డు సృష్టించింది. గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ కుమార్తె అయిన అభినయశ్రీ.. ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో, సెకండరీ విద్యను హుజూరాబాద్‌లో పూర్తి చేసింది. చిన్నతనం నుంచే చదువులో చురుకుగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకున్న అభినయశ్రీ, ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించడమే కాకుండా, కఠినమైన పోటీని తట్టుకుని బాసర ఐఐఐటీలో ప్రతిష్టాత్మక సీటును కైవసం చేసుకుంది.

​గ్రామంలో పండగ వాతావరణం..

ఎలాంటి కార్పొరేట్ హంగులు లేని గ్రామీణ వాతావరణంలో చదివి, బాసర ఐఐఐటీ లాంటి ఉన్నత విద్యాసంస్థకు ఎంపిక కావడంపై అభినయశ్రీ కుటుంబంలోనూ, ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామంలోనూ పండగ వాతావరణం నెలకొంది. తమ కుమార్తె సాధించిన ఈ విజయంపై తండ్రి క్రాంతి కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. ​"ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లల్లో అనంతమైన ప్రతిభ దాగి ఉందనడానికి అభినయశ్రీ సాధించిన విజయమే నిదర్శనం. క్రమశిక్షణ, నిరంతర శ్రమతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆమె తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచింది.ష‌ అని పాఠశాల ఉపాధ్యాయ బృందం పేర్కొన్నారు.​బాసర ఐఐఐటీకి ఎంపికైన అభినయశ్రీని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. భవిష్యత్తులో అభినయశ్రీ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.

Next Story