వ‌డ‌గ‌ళ్ల వాన బీభ‌త్సం.. రైత‌న్న‌ల‌కు తీవ్ర న‌ష్టం

by Ratna Kumari |

అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నలకు తక్షణమే నష్ట పరిహారం అందించాలని బీజేపీ జిల్లా అధ్య‌క్షులు రెడ్డ‌బోయిన‌ గోపి అన్నారు.

వ‌డ‌గ‌ళ్ల వాన బీభ‌త్సం.. రైత‌న్న‌ల‌కు తీవ్ర న‌ష్టం
X

దిశ, కోనరావుపేట : అకాల వర్షంతో నష్టపోయిన రైతన్నలకు తక్షణమే నష్ట పరిహారం అందించాలని బీజేపీ జిల్లా అధ్య‌క్షులు రెడ్డ‌బోయిన‌ గోపి అన్నారు. కోన‌రావు పేట మండ‌ల ప‌రిధిలోని మర్రిమ‌డ్ల గ్రామంలో బుధ‌వారం ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ప‌ర్య‌టించారు. ఆదివారం కురిసిన భారీ వ‌డ‌గ‌ళ్ల వర్షానికి న‌ష్ట‌పోయిన రైతుల పొలాల‌ను సంద‌ర్శించారు. అనంత‌రం న‌ష్ట‌పోయిన బాధిత రైతు కుటుంబాల‌ను ప‌రామ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రొడ్డ‌బోయిన గోపి మాట్లాడుతూ రైతు ఏడ్చిన రాజ్యం.. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడ్డట్టు చరిత్రలోనే లేద‌న్నారు. అకాల వర్షాల ప్రభావంతో రైతులు భారీగా నష్టపోతే అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందిస్తామని పత్రిక ప్రకటనలకు గొప్పలు చెప్పుకొని చేతులు దులుపుకుంటుంద‌న్నారు. వడగళ్ల వానతో సర్వం కోల్పోయిన రైతుల దుస్థితిని చూసి, ఐదు రోజులు గడుస్తున్న నష్టపరిహారాన్ని ప్రకటించకపోవడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు చేటు అని అన్నారు. చేతికొచ్చిన పంట కళ్లముందే నాశనమైందని అన్నదాతలు కన్నీరు మున్నేరు అవుతుంటే ఆవేదన చెందిన‌ట్టు తెలిపారు.

సర్వేల పేరుతో అధికారులు కాలయాపన చేస్తూ, రైతులను మభ్యపెడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. గత ఏడాది కూడా వెంకట్రావుపేట, ఎగులాస్పూర్ గ్రామాల్లో వడగళ్ల వానకు పంటలు దెబ్బతింటే, సర్వేలకే పరిమితమయ్యార‌ని.. న‌ష్ట‌ప‌రిహారం మాత్రం చెల్లించ‌లేద‌ని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా అదే తీరును రైతుల పట్ల అవలంబిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇకనైన ​ప్రభుత్వ వైఖరి మార్చుకోవాలని తక్షణమే క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలి డిమాండ్ చేశారు. లేని యెడల రైతు పక్షాన బీజేపీ పోరాటం చేస్తుంద‌ని హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కోనరావుపేట మండల అధ్యక్షులు మిర్యాల్‌కర్ బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్,గ్రామ సర్పంచ్ కోలా స్వాతి - శ్రీనివాస్ ,నాయకులు పల్లం అన్నపూర్ణ, మాజీ ఎంపీటీసీ రేణుక, బొల్ల శ్రీనివాస్,కుమ్మరి దిలీప్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story