మృతుడి ఇద్దరు పిల్లలలో ఒకరి చదువు బాధ్యత నాదే: Gone Prakash Rao

by Dishanational1 |
మృతుడి ఇద్దరు పిల్లలలో ఒకరి చదువు బాధ్యత నాదే: Gone Prakash Rao
X

దిశ, గోదావరిఖని: మంత్రి పేరుతో ఆయన బంధువులు అరాచకాలు సృష్టిస్తున్నారని మాజీ ఆర్టీసీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు అన్నారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే కొత్త డ్రామాలకు తెర తీస్తున్నాడని ఆరోపించారు. రామగుండం ఎరువుల కర్మాగారానికి సంబంధించిన ఉద్యోగాల కుంభకోణం అతిపెద్ద కుంభకోణం అని విమర్శించారు. వెంటనే అర్ ఎఫ్ సీ ఎల్ బాధితులకు న్యాయం చేసే పూర్తి బాధ్యత ఈ ప్రాంత మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్ లు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున మృతుని ముగ్గురు కుటుంబ సభ్యుల పేరు మీద 30 లక్షల రూపాయలు ఎమ్మెల్యేనే బాధ్యత తీసుకుని డిపాజిట్ చెయ్యాలని అన్నారు. అంతే కాకుండా మృతుని భార్యకు మెడికల్ కళాశాలలో ఏదైనా పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మృతుడి ఇద్దరు పిల్లలలో ఒకరి చదువు బాధ్యత తానే పూర్తిగా తీసుకుంటానని.. మరొకరి చదువు బాధ్యత ఎమ్మెల్యేనే తీసుకోవాలని అన్నారు. ఈ ప్రాంతంలో ఆర్ఎఫ్ సీఎల్ సమస్య పరిష్కరించకపోతే మళ్లీ నక్సలిజం వ్యవస్థ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయని.. నిరుద్యోగులు తుపాకులు పట్టే పరిస్థితి వస్తుందని అన్నారు.

ఈ నెల 29వ తేదీన సీఎం పర్యటన సందర్భంగా రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని.. ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ఓపెన్ దర్భార్ పెట్టి కొత్త డ్రామలకు తెరతిస్తున్నారని విమర్శించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై పీపుల్స్ లేఖ రాసే పరిస్థితికి వచ్చిందన్నారు. అంతేకాకుండా దోపిడీ అవినీతి పెరిగిపోయిందని.. రానున్న రోజుల్లో ఇసుక బూడిదతోపాటు మరిన్ని కుంభకోణాలు బయటపడతాయని అన్నారు. ఇప్పటికైనా పోలీసులు దీనిపై సుమోటో కేసు నమోదు చేయాలని తెలిపారు. ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి గెలిచిన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ లు పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు.


Next Story

Most Viewed