మీడియాపై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు

by Dishafeatures2 |
మీడియాపై పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కరీంనగర్ టౌన్: మీడియాపై కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనవరి 26 నుండి తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం కానున్న హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమ సన్నాహక సమావేశం శనివారం ఇందిరా గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ.. కొన్ని మీడియా సంస్థలు కావాలనే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నాయని, అందుకోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తమ నాయకుల మధ్య విభేదాలు వస్తే పెద్ద పెద్ద కథనాలు వేస్తారని, కానీ బీఆర్ఎస్ నాయకుల మధ్య తలెత్తిన వివాదాల గురించి ఏ మీడియా సంస్థ ప్రచారం చేయడం లేదని అన్నారు. మేడ్చల్ జిల్లాలో అధికార పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నలుగురు శాసనసభ్యులు ఆ సమావేశానికి హాజరు కాలేదని, అయినప్పటికీ దీనిపై ఎక్కడా వార్తలు రాలేదని పేర్కొన్నారు. కరీంనగర్ లో బీజేపీ బతికుండటానికి ముఖ్య కారకులైన గుజ్జుల రామకృష్ణారెడ్డి, సుగుణాకర్ రావు, మీస అర్జున్ రావు లాంటి నాయకులు బండి సంజయ్ పై తిరుగుబాటు చేస్తే ఎక్కడా ఒక వార్త కూడా కనబడటం లేదని అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్రను ఆపేందుకు బీజేపీ నాయకులు కుట్రలు జరుపుతున్నారని చెప్పారు. అందుకే కరోనా పేరుతో డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కడో చైనాలో కరోనా విస్తరిస్తుంటే.. దాన్ని సాకుగా చూపెట్టి జోడో యాత్రను ఆపాలని మోడీ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

ఢిల్లీ వరకు చేరుకోనున్న భారత్ జోడో వల్ల రాహుల్ గాంధీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి, భయంతో కోవిడ్ ఆంక్షల పేరుతో యాత్రను వాయిదా వేయించాలని, మంత్రివర్గ సమావేశానికి ముందే రాహుల్ గాంధీకి బీజేపీ ప్రభుత్వం నోటీసు పంపడం జరిగిందన్నారు. సిరిసిల్ల సెస్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం మొత్తంలో కేవలం సిరిసిల్లకు మాత్రమే రైతు బంధు నిధులు విడుదల చేయడం, నాలుగేళ్ల నుండి ఉన్న బతుకమ్మ చీరల బకాయిలను చెల్లించడం జరిగిందని ఆరోపించారు. ఇలాంటి నియంతలతో పోటీ పడాలంటే పార్టీ కార్యకర్తలు కృంగిపోకుండా ఆత్మస్థైర్యంతో పని చేయాలని కోరారు. నాయకుల పొరపాట్లను కార్యకర్తలు గుర్తించి తెలియజేయాలి తప్ప బహిరంగ ప్రకటనలు చేయకూడదని, పార్టీలో ప్రతి కార్యకర్తకు సమిష్టి బాధ్యత ఉంటుందని గ్రహించాలని తెలిపారు. జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే ఎన్నికైనా తర్వాత మొదటిసారి ఏర్పాటు చేసిన కోర్ కమిటీ సమావేశంలో దేశవ్యాప్తంగా జనవరి 26న గ్రామ స్థాయిలో ప్రతి బూతులో, ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ చేరాలనే హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశం ముగిసిన అనంతరం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రిస్మస్ కేకును పొన్నం ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కట్ చేసి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.


Next Story

Most Viewed