జూనియర్లు సీనియర్లుగా.. హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్లలో తీరని అన్యాయం

by Disha Web Desk 4 |
జూనియర్లు సీనియర్లుగా..  హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్లలో తీరని అన్యాయం
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పాత జోనల్ విధానంలో జరిగిన నష్టం కొత్త పద్దతిలో ఎదురు కాదనుకున్న వారి కలలు కలలుగానే మిగిలిపోయాయి. సమన్యాయం పాటిస్తారనుకున్నా.. వాస్తవం మాత్రం పూర్తి భిన్నంగా జరిగింది. జూనియర్లు సీనియర్లుగా మారిపోయారన్న ఆవేదన వారిలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్లలో తీరని అన్యాయం జరిగిందన్న వేదన వ్యక్తం అవుతోంది పోలీసుల్లో. రాష్ట్రవ్యాప్తంగా కానిస్టేబుళ్ల పదోన్నతుల ప్రక్రియ జరిగిన సంగతి తెలిసిందే. కాళేశ్వరం జోన్ పరిధిలోని జిల్లాలకు చెందిన 1999 బ్యాచ్ కానిస్టేబుళ్లు పదోన్నతి పొందగా.. ఇతర జోన్లలో మాత్రం 1995 బ్యాచ్ వరకే సరిపెట్టారు. బాసర, హైదరాబాద్ జోన్లలోని 1995 బ్యాచ్‌కి చెందిన అందరికీ పదోన్నతులు రాగా.. రాజన్న, బాసర జోన్‌లోని 1995 బ్యాచ్‌లో సగం మందికే ప్రమోషన్లు కల్పించారు. కాళేశ్వరం జోన్ కు చెందిన 1999 బ్యాచ్ వారు ఇతర జోన్లలోని 1995 బ్యాచ్ వారితో సమానంగా మారిపోగా.. రాజన్న, బాసర జోన్లలో పదోన్నతులు రాని 1995 బ్యాచ్ కానిస్టేబుళ్లు వారికంటే జూనియర్లుగా మిగిలిపోయారు. దీంతో పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందన్న ఆవేదన ప్రమోషన్ రాని కానిస్టేబుళ్లలో వ్యక్తం అవుతోంది.

2 రోజుల తేడాతో...

రాజన్న జోన్ లో సిద్దిపేట జిల్లా కూడా ఉంది. ఈ జిల్లాలకు చెందిన 1995 బ్యాచ్ కానిస్టేబుళ్లు 2 రోజుల ముందు ట్రైనింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యారన్న కారణంగా వారికి ముందుగా పదోన్నతి కల్పించారు. ఇక ఇదే జోన్ పరిధిలో ఉన్న ఇదే బ్యాచ్ పీసీలు రెండు రోజులు ఆలస్యంగా శిక్షణకు హాజరయ్యారన్న కారణంతో జూనియర్లుగా మారిపోయారు. దీంతో సిద్దిపేట జిల్లా కానిస్టేబుళ్లు మూడు పట్టీలతో ముచ్చట పడుతుంటే కరీంనగర్ జిల్లా కానిస్టేబుళ్లు మాత్రం అలాగే మిగిలిపోయారు. గతంలో సిద్దిపేట హైదరాబాద్ జోన్ లో ఉండగా.. కొత్త జోనల్ విధానంతో రాజన్న జోన్ లో కలిసింది. దీంతో తమ సహచరులు తమ కంటే ముందు పదోన్నతి పొందితే తమ ప్రమోషన్ కు బ్రేకులు పడ్డాయని అంటున్నారు. ఏది ఏమైనా ఉన్నతాదికారులు జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు 1995 బ్యాచ్ కానిస్టేబుళ్లు.



Next Story

Most Viewed