ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కృషి : రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీధర్ రెడ్డి

by Disha Web Desk 1 |
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కృషి : రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీధర్ రెడ్డి
X

దిశ, తిమ్మాపూర్ : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యా సంక్షేమం, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పర్లపల్లి, నల్లగొండ గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు కార్పొరేట్‌ స్థాయిలో నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించామని తెలిపారు. ప్రతి పేదవాడికి నాణ్యమైన విద్యను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.9 వేల కోట్లతో 26 వేల పాఠశాలల్లో భవనాలు, మరుగుదొడ్లు, నీటి వసతి, బోధన, క్రీడా సామగ్రి, సాంకేతిక విద్య వంటి అన్ని రకాల సదుపాయాలు కల్పించినట్లు ఆయన తెలిపారు.

కరీంనగర్ జిల్లాలోనే 230 పాఠశాలలకు రూ.90 కోట్లు కేటాయించామన్నారు. అదేవిధంగా పర్లపల్లి స్కూల్ ను రూ.47 లక్షల నిధులతో జిల్లాలోనే మాడల్ స్కూల్ గా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. పిల్లలకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. జూన్ నెలలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు తల్లిదండ్రులు కూడా కృషి చేయాలని కోరారు.

ఈ సందర్బంగా పర్లపెల్లి పాఠశాలల్లో వసతులు బాగున్నాయని సర్పంచ్ మాదాడి భారతి దేవిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, డీఈవో జనార్ధన్ రావు, ఎంపీడీవో రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎల్పీ కార్యదర్శి మాదాడి రమేష్ రెడ్డి, ఎంపీటీసీ ముప్పిడి సంపత్ రెడ్డి, ఉప సర్పంచ్ సుద్దాల రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story