తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఓ బలం: మంత్రి కేటీఆర్

by Disha Web Desk 1 |
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఓ బలం: మంత్రి కేటీఆర్
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఓ బలమని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని దుమాల, రాజన్నపేట దేవునిగుట్ట తండా, బాకూర్ పల్లె గ్రామాల్లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రాజన్నపేటలో రూ.35 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవన కార్యాలయం ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పేద ప్రజలను అనేక సంక్షేమ పథకాలతో ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ఆయన అన్నారు.

స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. ‘మావ నాటే మావ రాజ్’ - మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారని ఆయన అన్నారు. తెలంగాణలో 3,416 తాండలను పంచాయతీలుగా చేసి, 31 వేల మంది గిరిజనులను ప్రజాప్రతినిధులుగా పరిపాలన భాగస్వాములను చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

రాజన్నపేట గ్రామంలో రూ.33 లక్షలతో మన ఊరు.. మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలలో అదనపు తరగతి గదులు మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. రాజన్నపేట గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. గ్రామ అభివృద్ధి కోసం 2014 నుంచి ఇప్పటి వరకు రూ.20.38 కోట్లు ఖర్చు చేశామన్నారు. గ్రామంలో జరిగే అభివృద్ధి పనులను వివరాలను మంత్రి కేటీఆర్ ప్రజలకు వివరించారు.

అభివృద్ధికి నోచుకోని రాజన్నపేటలో వెనుకబాటుతనం ఉందని గుర్తించి స్వయాన తానే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తున్నానని అన్నారు. రాష్ట్రంలోనే ఇల్లు లేని నిరుపేద కుటుంబాల అందరికీ నూతనంగా ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లు మంజూరు చేయిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజన్నపేట గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ కొరకు నిధులు మంజూరు చేస్తామమని తెలిపారు. గ్రామంలో కుట్టు మిషన్ శిక్షణ తీసుకున్న మహిళలకు 90 కుట్టు మిషన్లు వారంలోగా అందజేస్తామని అన్నారు.

దేశంలో ఉన్న ఆదర్శ గ్రామాల్లో ఎక్కువ గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని మంత్రి పునరుద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ దూసుకెళ్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ఆర్డివో శ్రీనివాసరావు, ఎల్లారెడ్డిపేట మండల ఎంపీపీ, జడ్పీటీసీలు, సర్పంచ్ లు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed