వేములవాడలో క్యాంప్ రాజకీయాలు షురూ

by Ratna Kumari |

మున్సిప‌ల్ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. ఫ‌లితాల విడుద‌ల‌కు కొద్ది గంట‌ల ముందు గురువారమే వేముల‌వాడ‌లో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి.

వేములవాడలో క్యాంప్ రాజకీయాలు షురూ
X

దిశ, వేములవాడ : మున్సిప‌ల్ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా ముగిశాయి. ఫ‌లితాల విడుద‌ల‌కు కొద్ది గంట‌ల ముందు గురువారమే వేముల‌వాడ‌లో రాజ‌కీయాలు హీటెక్కుతున్నాయి. గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ 28మంది అభ్యర్థులు బుధవారం సాయంత్రం క్యాంప్ కు బయలుదేరి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసంలో సమావేశం ఏర్పాటు చేసుకొని ఆయన సూచనల మేరకు అభ్యర్థులు కొద్ది సేపటి క్రితమే ప్రత్యేక బస్సులలో క్యాంపున‌కు బయలుదేరి వెళ్ళారు. అయితే వీరు ఎక్కడికి వెళ్తున్నారు..?మళ్ళీ ఎప్పుడూ వస్తారు అనే సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ అభ్యర్థులు సైతం మరికొద్ది సేపట్లో క్యాంపున‌కు తరలి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే వెళ్తారా లేదా అనే దానిపై క్లారిటీ లేనప్పటికీ తప్పనిసరిగా వెళ్తారని పార్టీలోనీ ఓ కీలక నేత ఇచ్చిన సమాచారంతో తెలుస్తోంది. మరోవైపు బీజేపీ అభ్యర్థుల విషయంలో మాత్రం పూర్తి క్లారిటీ రానప్పటికీ గెలుపు పై ధీమాతో ఉన్న 5మంది అభ్యర్థులు మాత్రం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సూచనల మేరకు క్యాంపున‌కు తరలి వెళ్లినట్లు సమాచారం. అయితే బీజేపీ అభ్యర్థుల విషయంలో బండి సంజయ్ ఆలోచన ఒకలా ఉంటే.. పార్టీలోని స్థానిక కీలక నేత ప్రతాప రామకృష్ణ వైఖరి మరోలా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తో పొత్తుకు బండి సై అంటే రామకృష్ణ మాత్రం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని అవకాశం వస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నట్లు, దీనికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సై అంటూ రామకృష్ణ ఇప్పటికే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇది పార్టీకి అంతా మంచిది కాదని, కాంగ్రెస్ తో బీజేపీ పొత్తు అనేది పార్టీకి చాలా ప్రమాదకరమని, ఉమ్మడి జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందనే అంచనాతో బండి సంజయ్ రామకృష్ణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు, ఈ క్రమంలోనే ఐదు మంది అభ్యర్థులను తన పరిధిలో ఉండేలా క్యాంపున‌కు తరలించినట్లు స్థానికంగా తీవ్ర చర్చ కొనసాగుతుండ‌టం విశేషం.

Next Story