అన్నదాతకు కొండంత అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే రసమయి

by Disha Web Desk 1 |
అన్నదాతకు కొండంత అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం : ఎమ్మెల్యే రసమయి
X

దిశ, మానకొండూర్ : ఇటీవల నియోకవర్గ పరిధిలో కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన అన్నదాతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు నివాసంలో మంగళవారం నియోజకవర్గంలో ఉన్న రైస్ మిలర్ల యాజమాన్యంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటపై ప్రకృతి కన్నెర్ర చేయడం చాలా బాధాకరం అన్నారు. నియోజకవర్గంలో కురిసిన వడగళ్లకు దెబ్బతిన్న పంట నష్టంపై వ్యవసాయాధికారులు సర్వే చేపట్టి నివేదికను తయారు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతన్నలు అధైర్యానికి గురికావొద్దన్నారు. తడిసిన పంటను కొనుగోలు చేసి, రైస్ మిల్లర్లు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా సహకరించాలని అయన కోరగా ఇందుకు మిల్లర్లు సానుకూలంగా స్పందించారు.

దేశానికి అన్నం పెట్టే అన్నదాతను సీఎం కేసిర్ఆర్ ప్రభుత్వం కంటికిరెప్పలా కాపాడుకుంటందని ఎమ్మెల్యే వివరించారు. అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు రైతుల పేరుతో రాజకీయం చేస్తూ పబ్బం గడుపుకోవడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ అంటేనే రైతన్నలకు ఎంతో భరోసా అని.. తమది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని, అందుకే అన్నదాతలు రాష్ట్ర ప్రభుత్వానికి కొండంత అండగా నిలిచారని ఎమ్మెల్యే రసమయి అన్నారు.



Next Story