- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీబీఎఫ్సీ సభ్యుడిగా హుజురాబాద్ బీజేపీ నాయకుడు సబ్బని రమేష్ నియామకం..
హుజురాబాద్ పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సబ్బని రమేష్కు కేంద్ర ప్రభుత్వంలో అరుదైన గౌరవం దక్కింది.

దిశ, హుజురాబాద్ రూరల్: హుజురాబాద్ పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు సబ్బని రమేష్కు కేంద్ర ప్రభుత్వంలో అరుదైన గౌరవం దక్కింది. భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సభ్యుడిగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు రీజినల్ ఆఫీసర్ డాక్టర్ రాహుల్ గౌలికర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీర్ఘకాలంగా బీజేపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తున్న సబ్బని రమేష్కు కేంద్ర స్థాయిలో ఈ కీలక బాధ్యతలు దక్కడం పట్ల హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన నియామకం హుజురాబాద్ పట్టణానికే గర్వకారణమని వారు పేర్కొన్నారు.
బాధ్యతాయుతంగా పనిచేస్తా.. సబ్బని రమేష్
ఈ అరుదైన అవకాశంపై సబ్బని రమేష్ స్పందిస్తూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డితో పాటు పార్టీ జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. "నాకు అప్పగించిన బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తాను. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సంస్థ యొక్క ప్రతిష్టను, నమ్మకాన్ని మరింత పెంపొందించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను." అని సబ్బని రమేష్ తెలిపారు. రమేష్ నియామకంతో హుజురాబాద్ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పట్టణంలోని పలువురు ప్రముఖులు, పార్టీ శ్రేణులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.






