మలేషియాలో వ్యక్తి ఆత్మహత్య.. నలుగురిపై కేసు నమోదు

by Disha Web Desk 1 |
మలేషియాలో వ్యక్తి ఆత్మహత్య.. నలుగురిపై కేసు నమోదు
X

దిశ, గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల తండాకు చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం మలేషియా దేశానికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల పరిధిలోని ముచ్చర్ల తండాకు చెందిన భూక్య అజయ్ అదే గ్రామానికి చెందిన సరిత అని యువతిని కొన్ని రోజుల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, బతుకుదెరువు కొరకు మలేషియాకు వెళ్లాల్సిందిగా భార్య సరిత కోరడంతో ఇటీవల ఆ దేశానికి వెళ్లాడు. భార్య సరిత సిద్దిపేట పట్టణంలో కానిస్టేబుల్ కోచింగ్ తీసుకుంటోంది. ఈ క్రమంలో అజయ్ ని భార్య సరిత, అత్త, మామ మరో స్నేహితుడు తీవ్ర వేధింపులకు గురి చేశారని అజయ్ తల్లి తెలిపింది. దీంతో ఒత్తిడి తట్టుకోలేక మార్చి 30న అజయ్ రూమ్ లోకి వెళ్లి క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి స్నేహితుల విషయం మృతుడి తల్లికి తెలిసింది. ఈ మేరకు అజయ్ భార్య సరిత, అత్త, మామ, మరో స్నేహితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మహేష్ తెలిపారు.

మృతదేహంతో భార్య ఇంటి ఎదుట ధర్నా..

భార్య సరిత, అత్త, మామ, భార్య స్నేహితుడి వేధింపులతో మనస్తపానికి గురైన అజయ్ మలేషియాలో ఆత్మహత్యకు పాల్పడగా.. ఆగ్రహించిన అజయ్ కుటుంబ సభ్యులు మృతదేహంలో సరిత ఎంటి ఎదుట ఆందోళనకు దిగారు. తన కొడుకు మృతికి కారణమైన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట సీఐ మొగిలి, ఎస్సై మహేష్ మృతుడి బంధువులకు న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమింపజేశారు.



Next Story

Most Viewed