పార్టీని కార్యకర్తలు కాపాడితే..కార్యకర్తలను పార్టీ కాపాడుకుంది : మినిస్టర్ గంగుల

by Disha Web Desk 20 |
పార్టీని కార్యకర్తలు కాపాడితే..కార్యకర్తలను పార్టీ కాపాడుకుంది : మినిస్టర్ గంగుల
X

దిశ, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధితో పచ్చగా ఉన్న తెలంగాణను చూసి ఓర్వ లేక, ఇక్కడి వనరులు, నిధులు కొల్లగొట్టాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి, షర్మిల ముగ్గురు ఏకమయ్యారని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కరీంనగర్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నా బలమే కార్యకర్తలు అని ఏ ఒక్క కార్యకర్తకు బాధ కలిగినా నాకు కలిగినట్టేనని, నా చివరి రక్తం బొట్టు వరకు కార్యకర్తల ముఖంలో చిరునవ్వు కోసం పని చేస్తానని అన్నారు. మనమందరం కేసీఆర్ బలగమని మనమంతా ఐకమత్యంగా ఉండి బీఆర్ఎస్ పార్టీని మరింత బలపేతం చేసుకుందామన్నారు.

తెలంగాణ రాకముందు మనమందరం ఉన్నామని. ఎంతో మంది సీఎం, పీఎంలు వచ్చారు. పోయారే తప్ప మనకోసం చేసిందేమి లేదన్నారు. కానీ మన పరిస్థితులు ఎలా ఉండేవో ఆలోచించుకోవాలన్నారు. సమైక్య పాలనలో... కరెంట్ ఎప్పుడు వస్తుందో పోతుందో తెలియదని... తాగునీటి కోసం ట్యాంకర్ల వద్ద యుద్దాలు చేసిన రోజులు ఉండేవని, కాని తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్, తాగునీటి ఇబ్బంది లేకుండా చేశామని అన్నారు. సమైక్య పాలనలో 75 సంవత్సరాలుగా పేరుకుపోయిన దరిద్ర్యాన్ని తొలగిస్తున్నామని అన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టే మన వనరులను మనం సంరక్షించుకొని వాడుకునే పరిస్థితి ఉందని అన్నారు. పచ్చని తెలంగాణను చూసి విపక్షాలకు, కడుపు మంట, కళ్ళ మంట ప్రారంభం అయిందని, మన వనరులను కొల్లగొట్టాలని, రాజ్యాధికారం కావాలని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవలని చూస్తున్నారని అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధిష్టానం ఢిల్లీలో ఉందని అక్కడి నుండి కంట్రోల్ చేస్తూ ఇక్కడి వనరులను దోచుకోవడానికి చూస్తున్నారని అన్నారు. తెలంగాణను కాపాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్ఎస్ పార్టీకే ఉందని చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఇదే విషయం చెప్తారని అన్నారు. మనమంతా ఒక కుటుంబమని కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు సహజమని వాటిని అంతర్గతంగా పరిష్కరించుకుందామని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నారని ఆయన చేతులకు మనమంతా బలం కావాలని అన్నారు. కార్యకర్తలు పార్టీని కాపాడితే పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటుందని క్రమశిక్షణ కలిగిన పార్టీ టీఆర్ఎస్ అని అందరూ క్రమశిక్షణ దాటద్దని సూచించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమళ్ళ విజయ, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, మండల పార్టీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షులు కాశెట్టి శ్రీనివాస్, నగునూర్ గ్రామసర్పంచ్ శ్రీధర్, ఆయ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed