డిగ్రీ పరీక్షకు హాజరైన పెళ్లి కూతురు

by Disha Web Desk 1 |
డిగ్రీ పరీక్షకు హాజరైన పెళ్లి కూతురు
X

దిశ, కోరుట్ల : ఉన్నత చదువులు చదివేందుకు ప్రస్తుతం జరుగుతున్న డిగ్రీ పరీక్షలకు ఓ నవ వధువు హాజరైంది. అప్పుడే తాళి కట్టిన తన భర్త అనుమతితో డిగ్రీ ద్వితీయ సంవత్సరం పరీక్షకు పెళ్లి కూతరు హాజరైంది. వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో అయ్యప్ప గుట్ట ప్రాంతంలో గల చింతలవాడకు చెందిన ఈర్ణాల పద్మావతి బీఎస్సీ బీజెడ్సీ ద్వీతీయ సంవత్సరం చదువుతోంది. రాజు అనే వ్యక్తితో పద్మావతికి వివాహం నిశ్చయమైంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో లాస్య మేడలో రాజు తాళి కట్టాడు.

ఈ క్రమంలో డిగ్రీ ద్వీతీయ సంవత్సరం చదువుతున్న పద్మావతి తన పెళ్లి రోజే కెమిస్ట్రీ పరీక్ష ఉండడంతో అప్పుడే తాళి కట్టిన తన భర్త రాజు అనుమతితో పరీక్షకు హాజరైంది. కల్లూరు రోడ్డులోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాలలో గల పరీక్ష కేంద్రానికి ఆ నవ దంపతులు వెళ్లారు. తన భార్య పద్మావతి పరీక్ష రాయడానికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని పరీక్ష కేంద్రంలోని అధికారులను రాజు కోరాడు. రాజు అభ్యర్థనను మన్నించి పద్మావతికి ప్రత్యేక గదిని కేటాయించారు. ఈ సందర్భంగా భర్త రాజు మాట్లాడుతూ.. తన భార్యను ఉన్నత చదువులు చదివించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.


Next Story

Most Viewed