- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం.. కేంద్ర సాధికార కమిటీ సంచలన రిపోర్ట్
కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల వ్యవహారం కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్డెస్క్: కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli) భూముల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ వివాదాస్పద భూములను అటవీ ప్రాంతంగా ప్రకటించి నిర్వహణను తెలంగాణ అటవీ శాఖ (Telangana Forest Department)కు అప్పగించాలని కేంద్ర సాధికార కమిటీ (Central Empowered Committee) సిఫారసు చేసింది. ఆ భూముల్లో ఉన్న జీవ వైవిధ్యం దృష్ట్యా ఆ భూములను వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 కిందకు తెచ్చే అంశాన్ని కూడా ఒకసారి పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా సీఈసీ తుది నివేదికను సుప్రీం కోర్టు (Supreme Court)కు సమర్పించింది.
అక్కడ వందలాది వృక్ష జాతులున్నాయి..
నివేదికలో కంచ గచ్చిబౌలి భూముల్లో సహజసిద్ధమైన చెట్లతో పాటు, అనేక రకాల చెట్లు, పచ్చదనం ఉన్నాయని తెలిపారు. జింకలు, నెమళ్లు, సరీసృపాలు స్వేచ్ఛగా సంచరించే ప్రాంతమని పేర్కొన్నారు. వందల వృక్ష జాతులతో పాటు అక్కడ మొత్తం నాలుగు కుంటలు ఉన్నాయని తెలిపారు. కొట్టేసిన చెట్ల స్థానంలో మళ్లీ మొక్కలు నాటి దట్టమైన పచ్చదనం పెంపొందించేలా చేయాలన్నారు. వచ్చే వర్షాకాలంలోనే ఈ పని చేపట్టాలని తెలిపారు. భూసార, జల సంరక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టాలి. అక్కడి జల వనరులన్నింటినీ వెట్ ల్యాండ్స్ (Wet Lands) సంరక్షణ, నిర్వహణ నిబంధనలు-2017 ప్రకారం సంరక్షించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అటవీ భూములను గుర్తించడానికి నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించాలని అన్నారు. ఆ కమిటీలో అటవీ అధికారులు, వన్యప్రాణి నిపుణులు, జీవావరణవేత్తలు, ఐటీ (IT), రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే ఏజెన్సీలు ఉండాలని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం అటవీ ప్రాంతాల్లా ఉన్న వాటిని కమిటీ గుర్తించాలని, ప్రైవేటు భూముల కంటే ప్రభుత్వ భూములను అటవీ ప్రాంతాలుగా గుర్తించే విషయంలో కమిటీ మరింత కఠినంగా ఉండాలని సిఫారసు చేశారు.
రూ.14,52 లక్షల ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి
అటవీ భూములుగా వేటిని గుర్తించాలో నిపుణుల కమిటీ కొన్ని వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీని వేయాలని సీఈసీ సిఫారసు చేసింది. అందులో పీసీసీఎఫ్ (PCCF), సీసీఎల్ఏ (CCLA), న్యాయ నిపుణులు, పర్యావరణవేత్తలు ఉండాలని సూచించారు. కంచ గచ్చిబౌలిలో తొలగించిన చెట్లను నిర్ధారించేందుకు అయిన రూ.14.52 లక్షల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, ఆ మొత్తాన్ని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాకు వెంటనే చెల్లించాలని సీఈసీ (CEC) సూచించింది.






