ఎందుకూ పనికిరాని ప్రాజెక్టుగా కాళేశ్వరం.. రిపేర్లు చేసినా ఫంక్షనింగ్ డౌటే..!

by Disha Web Desk 2 |
ఎందుకూ పనికిరాని ప్రాజెక్టుగా కాళేశ్వరం.. రిపేర్లు చేసినా ఫంక్షనింగ్ డౌటే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం..ప్రపంచంలోనే మానవ అద్భుతం.. సాగునీటి రంగంలోనే నూతనాధ్యాయం.. ఆసియాలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు.. ఇలాంటి టాగ్‌ లైన్లకు కాలం చెల్లిపోయింది. అది ఎందుకూ పనికిరాని ప్రాజెక్టుగానే ఉండిపోనున్నది. సుమారు లక్ష కోట్ల రూపాయలతో కట్టిన ఈ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు ఇక ఎప్పటికీ మొండి గోడలుగానే దర్శనమివ్వనున్నాయి. ‘ఇది కేసీఆర్ కట్టించిన బ్యారేజీ’ అంటూ భవిష్యత్తు తరాలు చెప్పుకునేలా నిరర్ధకమైనవిగా మిగిలిపోనున్నాయి. వీటి పటిష్టతపై నిపుణులు స్పష్టత ఇచ్చేంతవరకూ అటు కూల్చలేక.. ఇటు ఫంక్షనింగ్‌లోకి తేవడానికి వీలుకాక.. డిస్‌ప్లే మోడల్‌కే పరిమితం కానున్నాయి.

‘గత పాలకుల మేధోశక్తికి నిదర్శనం’ అంటూ ఇప్పటికే సెటైర్లు వినిపిస్తున్నాయి. ఈ డ్యామేజీని సమర్థించుకోలేక, వ్యతిరేకించలేక కేసీఆర్ సైలెంట్‌గా ఉండిపోయారు. నాలుగేండ్ల క్రితం ప్రారంభోత్సవం సమయంలో ఈ ప్రాజెక్టుల నిర్మాణ ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. ప్లానర్, డిజైనర్, ఇంజినీర్, ఆర్కిటెక్ట్, విజనరీ.. ఇలా ఎన్నో రూపాల్లో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్‌ను కొనియాడారు. నాలుగేండ్లు తిరక్కుండానే ఒక్కో బ్యారేజీలోని డిఫెక్టు బయటపడుతుండడంతో కక్కలేక, మింగలేక చిక్కుల్లో పడ్డారు. పిల్లర్ల పగుళ్లు, కుంగిపోయిన బ్యారేజీ, చుక్క నీరు లేక బోసిపోయిన అప్ స్ట్రీమ్ రిజర్వాయర్, మౌనంగా ఉండిపోయిన పంప్ హౌజ్ మోటార్లు.. ఇదీ ఇప్పుడు కాళేశ్వరంలోని తాజా దృశ్యం.

పనికిరాని ప్రాజెక్టుగా..

గత ప్రభుత్వ ప్లానింగ్ ప్రకారం ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది మేడిగడ్డ బ్యారేజీ. ఇప్పుడు అది ప్రమాదంలో పడడంతో నీటి నిల్వకు ఆస్కారం లేకుండాపోయింది. దీంతో అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు నీటిని ఎత్తిపోసే అవకాశమూ లేదు. మొత్తంగా మూడు బ్యారేజీలూ అలంకారప్రాయమైపోయాయి. అప్పులు తెచ్చి మరీ కట్టిన ప్రాజెక్టు రైతుల అవసరాలకు అక్కరకు రానిదిగా మిగిలిపోయింది. దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేసినా పనికొస్తాయో లేదో తెలియని అనిశ్చితి నెలకొన్నది. దీన్ని కూల్చేయడానికీ, పనిచేయించడానికి నిర్ణయం తీసుకోలేని సందిగ్ధ పరిస్థితి నెలకొన్నది. సుమారు 19 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, మరో 19 ఎకరాల స్థిరీకరణ లక్ష్యం ప్రశ్నార్థకంగా మారింది.

బెడిసికొట్టిన డిఫెన్స్ కామెంట్లు..

‘నాలుగైదు పిల్లర్లు డ్యామేజ్ అయితే ప్రభుత్వం దీన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నది’ అంటూ బీఆర్ఎస్ లీడర్లు కామెంట్ చేస్తున్నారు. కానీ జరిగిన నష్ట తీవ్రత ఎంతో దగ్గరి నుంచి చూసే ప్రయత్నం చేయలేదు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే మేడిగడ్డ పిల్లర్లకు పగుళ్లు వచ్చినా స్వయంగా ఆయనా వెళ్లి పరిశీలించలేదు. అధికారులతో సమీక్షించనూ లేదు. చిన్న సమస్యేనంటూ కేటీఆర్, హరీశ్‌రావు వ్యాఖ్యానిస్తున్నారు. డిపార్టుమెంటు ఇంజనీర్లు, నిర్మాణ సంస్థ నిర్వాహకులు రిపేర్ పనులపై క్లారిటీ ఇవ్వలేదు. దెబ్బతిన్న పిల్లర్లకే మరమ్మతు చేపట్టాలా? లేక కొత్తవాటిని నిర్మించాలా? లేక బ్లాకు మొత్తాన్నే రీప్లేస్ చేయాలా? ఇలాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి.

కేసీఆర్ ఫేమ్.. డీఫేమ్..

గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరమే తొలినాళ్లలో కేసీఆర్‌కు గుర్తింపు తెచ్చి పెట్టింది. కేసీఆర్ పేరును అప్పటి గవర్నర్ నరసింహన్ కాళేశ్వరరావుగా మార్చారు. అప్పట్లో కేసీఆర్ ప్రతిష్టను, పాపులారిటీని ఇనుమడింపజేసిన కాళేశ్వరమే ఇప్పుడు మసకబార్చింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో పచ్చటి పొలాలు, మూడు కోట్ల టన్నుల వరి పంట, సంవత్సరం పొడవునా సాగునీరు, సూర్యాపేట వరకూ గోదావరి జలాలు, ఇలాంటి గొప్పలు చెప్పుకున్న కేసీఆర్.. గతేడాది అక్టోబరులో మేడిగడ్డి బ్యారేజీ డ్యామేజ్ కావడంతో కాళేశ్వరం మాట పలకడానికే ధైర్యం చేయలేదు. నల్లగొండలో గత వారం జరిగిన పబ్లిక్ మీటింగ్‌లో ఫస్ట్ టైమ్ మేడిగడ్డ పేరును ప్రస్తావించి మరింత బదనాం అయ్యారు.

ప్రత్యామ్నాయంగా ప్రాణహిత..

ఇప్పుడున్న పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన బ్యారేజీలు పనిచేసే స్థితిలో లేనందున రైతుల సాగునీటి అవసరాలకు ప్రత్యామ్నాయంగా ప్రాణహిత తెరపైకి వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టును పునరుద్ధరిస్తామంటూ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుని లాంఛనంగా పనులను ప్రారంభించి పూర్తిచేసేంత వరకు రైతులకు సాగునీరు ఎలా అనేది కీలకంగా మారింది. ఇప్పుడు ప్రాజెక్టు నిరర్ధకం కావడం, ప్రత్యామ్నాయంగా కొత్తది లేకపోవడంతో అనిశ్చితి నెలకొన్నది. మరో నాలుగైదు నెలల్లో వచ్చే వర్షాకాలంలో వరదనీటిని నిల్వ చేసుకునే అవకాశం లేకుండాపోయింది.

కేసీఆర్, బీఆర్ఎస్ ఉన్నంతవరకూ..

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను కూల్చడంపైనా, పనిచేయించడంపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకోడానికి సమయం పట్టే అవకాశమున్నది. అప్పటివరకు ఇవి అలంకారానికే పరిమితం. పొలిటికల్‌గా బీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడానికి ఇవి ఇలాగే ఉండిపోతాయి కాబోలు! వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికీ కాంగ్రెస్‌కు ప్రచారాస్త్రంగా మారతాయి. మొండిగోడలుగా ఉంచినంతకాలం ప్రజలకు కేసీఆర్‌ నెగెటివ్ సెన్స్ లో గుర్తుండిపోతారు. ఇప్పటికే ‘80 వేల పుస్తకాలు చదివిన మేధావి పనితనం ఇదీ... పనోడు పందిరేస్తే...’ లాంటి విమర్శలు వస్తున్నాయి. ప్రాణహితను నిర్మించి, ఫలాలు అందించి కేసీఆర్‌ను మరింత డీఫేమ్ చేయడానికి కాంగ్రెస్ వాడుకోనున్నది.



Next Story

Most Viewed