నేడు కవిత మధ్యంతర బెయిల్‌పై తీర్పు.. కుమారుడి పరీక్షల కోసం ఎమ్మెల్సీ రిక్వెస్టు

by Disha Web Desk 2 |
నేడు కవిత మధ్యంతర బెయిల్‌పై తీర్పు.. కుమారుడి పరీక్షల కోసం ఎమ్మెల్సీ రిక్వెస్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయ్యి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై రౌస్ ఎవెన్యూ కోర్టు సోమవారం ఉత్తర్వులు ఇవ్వనున్నది. చిన్న కొడుకు పరీక్షలు జరుగుతున్నందున చదివించేందుకు, తల్లిగా నైతిక మద్దతు ఇచ్చేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గత నెలలోనే కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే తనను పది రోజుల పాటు ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారని, స్టేట్‌మెంట్ కూడా రికార్డు చేశారని, చెప్పాల్సినవన్నీ చెప్పానని, కుమారుడి చదువు కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అందులో కోరారు. ఈడీ తరఫు న్యాయవాది మాత్రం ఆమెను బెయిల్‌పై విడుదల చేస్తే సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారని, ఆమెను జ్యుడిషియల్ రిమాండ్‌లోనే కొనసాగించాలని కోరారు. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన ఒకరిని బెదిరించి ఒత్తిడి తీసుకొచ్చారని, బెయిల్‌పై విడుదలైతే ఇలాంటివే రిపీట్ అవుతాయన్నారు.

ఇరు తరఫున సుదీర్ఘంగా వాదనలు జరిగిన అనంతరం తీర్పును రిజర్వు చేస్తున్నట్లు స్పెషల్ జడ్జి కావేరీ భవేజా మూడు రోజుల క్రితం ప్రకటించారు. ఆ ప్రకారం సోమవారం ఉదయం 10.30 గంటల తర్వాత ఆమె తీర్పును వెల్లడించనున్నారు. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత, ఇవ్వొద్దంటూ ఈడీ వాదనలు చేసిన నేపథ్యంలో స్పెషల్ జడ్జి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉండగా కవితను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలంటూ రౌస్ ఎవెన్యూ కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేయడంతో వారం రోజుల్లో ఆమెను తీహార్ జైల్లోనే ఎంక్వయిరీ చేయటడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఆ ఎంక్వయిరీని రద్దు చేయాల్సిందిగా కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనున్నది.



Next Story

Most Viewed