‘ప్రజల వద్దకు వెళ్లి ఆ విషయం చెప్పండి చాలు’.. బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం

by Gantepaka Srikanth |

బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు.

‘ప్రజల వద్దకు వెళ్లి ఆ విషయం చెప్పండి చాలు’.. బీఆర్ఎస్ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఎర్రవల్లిలోని ఫామ్‌హౌజ్‌లో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)పై కేసీఆర్‌ వారితో చర్చించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు, చేరికలు, ప్రచార శైలి తదితర అంశాలపై చర్చించారు. మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికలో మాగంటి సునీత(Maganti Sunitha) గెలుపును జూబ్లీహిల్స్ ప్రజలు ఇప్పటికే ఖాయం చేశారని, పార్టీ నేతలు ప్రజల వద్దకు వెళ్లి వారితో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలన పట్ల మరింత అవగాహన కల్పించి భారీ మెజారిటీ కోసం గట్టి ప్రయత్నం చేయాల్సి ఉన్నదని పార్టీ నేతలతో కేసీఆర్ పునరుద్ఘాటించారు.

నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ పాలనతో ఇప్పటికే రాష్ట్రం గుల్ల గుల్ల అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజ్ఞులైన జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి, జూబ్లీహిల్స్ గౌరవాన్ని హైదరాబాద్‌లో శాంతి భద్రతలను కాపాడుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో, బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న మాగంటి సునీత భారీ మెజారిటీతో గెలుపు కోసం కృషి చేయాలని నేతలకు కేసీఆర్ సూచించారు.

మాగంటి సునీత భారీ మెజారిటీతో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలు ఎత్తుగడలు, కార్యాచరణకు సంబంధించి, అధినేత కేసీఆర్ సమావేశంలో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో దిగజారిన అభివృద్ధి గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో తలెత్తిన ప్రమాదకర పరిస్థితులను గురించి వారికి ఇంటింటికీ తిరిగి వివరించాలని పార్టీ నేతలకు అధినేత కేసీఆర్ ఉద్ఘాటించారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధికార్యక్రమాలు, మానవీయ కోణంలో అమలుచేసిన సంక్షేమ పథకాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎందుకు మాయమయ్యాయనే విషయాన్ని ప్రజలతో కలిసి చర్చించాలని అధినేత సూచించారు.

Next Story