‘కేటీఆర్ కూడా అక్కడే కార్లు కొన్నారు’.. బండి సంజయ్‌కి జగదీష్ రెడ్డి కౌంటర్

by Gantepaka Srikanth |

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)కి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) కౌంటర్ ఇచ్చారు.

‘కేటీఆర్ కూడా అక్కడే కార్లు కొన్నారు’.. బండి సంజయ్‌కి జగదీష్ రెడ్డి కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌(Bandi Sanjay)కి బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌వి చిల్లర మాటలు అని మండిపడ్డారు. ఆయన కార్లు ఏ షోరూంలో కొనుగోలు చేశారో.. కేటీఆర్(KTR) కూడా అక్కడే కొనుగోలు చేశారని చెప్పారు. సెకండ్ హ్యాండ్ కార్లు ఎవరైనా కొంటారు.. ఇదేనా బండి సంజయ్‌ గొప్పగా కనిపెట్టింది అని విమర్శించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు బ్రెయినే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కృష్ణానదిలో జలాల్లో వాటాలపై చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.

కాగా, అంతకుముందు కేటీఆర్‌పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ పార్టీ అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లపై నడుస్తుందా? అంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కి పలు ప్రశ్నలు సంధించారు. లగ్జరీ కార్ల స్కామ్ నిందితుడు బషరత్ ఖాన్ దిగుమతి చేసిన ల్యాండ్ క్రూజర్లలో కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారని బండి సంజయ్ నిలదీశారు. ఆ కార్లు కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన కంపెనీల పేర్లతో ఎందుకు రిజిస్టర్ అయ్యాయని ప్రశ్నించారు. మార్కెట్ ధర చెల్లించారా? లేక తక్కువగా చూపించి కొనుగోలు జరిగిందా? అని బండి సంజయ్‌ అన్నారు. పేమెంట్లు బినామీ పేర్లతో ఉన్నాయా? నకిలీ ఆదాయమా? లేక మనీలాండరింగ్ ద్వారానా? అని ప్రశ్నించారు. ఇందులో నిజాలు బయటకు రావాలని, సంబంధిత శాఖలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తాజాగా బండి సంజయ్ కామెంట్స్‌కు జగదీష్ రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు.

Next Story