ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా చేసింది ఓవైసీనే: ఎంపీ లక్ష్మణ్ వివాదాస్పద వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా చేసింది ఓవైసీనే: ఎంపీ లక్ష్మణ్ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఓల్డ్ సిటీకి మెట్రో రాకుండా చేసింది ఓవైసీనే అని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇవాళ చార్మినార్ అసెంబ్లీ పరిధిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధాని చేసేందుకు మద్దతుగా విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందని అన్నారు. ఎంఐఎం కంచుకోటగా చెప్పుకుంటున్న హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి కైవసం చేసుకుంటామని అన్నారు.

కేవలం బడా వ్యాపారులకు మాత్రమే కొమ్ము కాస్తూ.. నిరుపేదలను పట్టించుకోని ఎంఐఎం‌కు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అప్పుడే మాట మారుస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలయ్యేంత వరకు తన పోరాటం ఆగదని అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ 90 లక్షల రేషన్ కార్డులుంటే కేవలం 40 లక్షల మందికే రూ.500లకు సిలిండర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే ఈ పథకాలు ప్రారంభించారని ఆరోపించారు.

ఓల్ట్ సిటీ అభివృద్ధి చెందకుండా చేసింది, మెట్రో రాకుండా చేసింది ఓవైసీయేనని లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వారి పక్కన చేరడం ఓవైసీ బ్రదర్స్ పని అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజలు నిజాలు గ్రహించి దేశం కోసం పని చేసే బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ఒక్కసారి అవకాశం ఇస్తే.. ఓల్డ్ సిటీని ఊహించని విధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.


Next Story

Most Viewed