నిజాలు దాచిన బీఆర్ఎస్ సర్కార్.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌తో లాభం జరిగింది వారికే!

by Disha Web Desk 2 |
నిజాలు దాచిన బీఆర్ఎస్ సర్కార్.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌తో లాభం జరిగింది వారికే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు బెనిఫిట్ రైతులు, ప్రభుత్వానికంటే కాంట్రాక్టర్లకే మేలు ఎక్కువగా జరిగిందని కాగ్ అభిప్రాయపడింది. అనేక కోణాల్లో విశ్లేషించిన కాగ్.. అసెంబ్లీకి సమర్పించిన 260 పేజీల రిపోర్టులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ తీరు, ప్రాజెక్టు డిజైన్, ప్లానింగ్ మొదలు ఎగ్జిక్యూషన్ వరకు చోటుచేసుకున్న లోపాలను బట్టబయలు చేసింది. ఆనాడు డీపీఆర్ అడిగితే కూడా నాటి ప్రభుత్వం ఇవ్వలేదని పేర్కొంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో కంప్లీట్ అయ్యి ఆశించిన ఫలాలు అందాలంటే ఎన్నో ఏళ్లు పడుతుందని వ్యాఖ్యానించింది.

ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్ట్ను రీ-డిజైన్ పేరిట కాళేశ్వరాన్ని గత బీఆర్ఎస్ సర్కార్ నిర్మించినా ఫలితం శూన్యం అని కాగ్ వెల్లడించింది. కాళేశ్వరం డీపీఆర్‌లో గత సర్కార్ గొప్పలు చెప్పుకున్నదని, తప్పుడు గణాంకాలను చూపిందని ఉదహరించింది. ప్రాజెక్టు ఖర్చు, దాని నుంచి వచ్చే ప్రయోజనం విషయంలో 1:151గా మార్చి చెప్పినా.. చివరకు అది 1:52 మాత్రమేనని తేల్చింది. అంటే ప్రతీ రూపాయి ఖర్చుకు రూపాయిన్నర ప్రయోజనం ఉంటుందని డీపీఆర్‌లో పేర్కొన్నా.. ప్రస్తుతం అది 75 పైసల దగ్గర ఆగిందని, భవిష్యత్‌లో అది 52 పైసలకే పరిమితమవుతుందని పేర్కొన్నది.

ఒక్కో టీఎంసీకి సుమారు 17,668 ఎకరాల మేర సాగవుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నా.. వాస్తవానికి10 వేల ఎకరాలకు మాత్రమే పరిమితమైందని వివరించింది. ఈ ప్రాజెక్టుతో 18.26 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాధ్యమని పేర్కొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి 2022 నాటికి కేవలం 40,888 ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలిగిందని తెలిపింది. పాత ప్రాణహిత-చేవెళ్ళ డిజైన్ ద్వారా రంగారెడ్డి జిల్లాలో 2.47 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా పెట్టుకుంటే.. కాళేశ్వరం రీ-డిజైన్ వలన ఆ జిల్లాలో సాగు ప్రయోజనం 50 వేల ఎకరాలకంటే తక్కువ భూమికే పరిమితమైంది.

కాళేశ్వరంతో ఖరీఫ్, రబీ సీజన్‌లకు సాగు నీరందుతుందని డీపీఆర్‌లో పేర్కొన్నా 169 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోసే అవకాశం ఉండటంతో ఏదో ఒక సీజన్‌కు మాత్రమే సరిపోనున్నట్లు కాగ్ తెలిపింది. నీటిని ఎత్తిపోయడానికి విద్యుత్‌ ఒక్కో యూనిట్‌కు రూ.3 ఖర్చవుతుందని డీపీఆర్‌లో పేర్కొంటే.. ఇప్పుడది రూ.6.40 (ఒక్కో యూనిట్)కు పెరిగిందని తెలిపింది. దీని ప్రకారం ఏటా ఒక్క విద్యుత్ బిల్లులకే రూ.10,647 కోట్లు కావాల్సి ఉంటుందని చెప్పింది.

కాళేశ్వరంలోని మొత్తం 21 ప్యాకేజీలకు సంబంధించిన అగ్రిమెంట్లలో కేవలం నాలుగింటి వివరాలను మాత్రమే ప్రభుత్వం ఇచ్చిందని, మిగిలిన వాటిని రకరకాల కారణాలతో అందజేయలేదన్నది. ఈ 4 ప్యాకేజీలకు అవసరమైన మోటార్లను బీహెచ్ఈఎల్ నుంచి రూ.1,689 కోట్లు వాస్తవ ధరతో కొంటే దాన్ని రూ.7,212 కోట్లకు కాంట్రాక్టర్లు కొన్నట్లుగా తేలిందని పేర్కొన్నది. అంటే రూ.5,525 కోట్ల మేర ఎక్కువ పేమెంట్ చేశారని, 327% మేర ఎక్కువ ధర కోట్ చేసినట్లు ఆ నివేదికలో కాగ్ స్పష్టంచేసింది. దీని ప్రకారం కాంట్రాక్టర్లకు అనుచిత లబ్ధి చేకూరిందని, అన్ని ప్యాకేజీలను పరిశీలిస్తే దీనివిలువ చాలా ఎక్కువగా ఉందని తెలిపింది.

ఇక ఆయకట్టు విషయంలో ప్రభుత్వ లెక్కలు, ఆయా సర్కిళ్ళ ఇంజనీర్లు చెప్పే లెక్కల మధ్య చాలా వ్యత్యాసం ఉన్నట్లు కాగ్ పేర్కొంది. కొత్త ఆయకట్టు టార్గెట్ 18.26 లక్షల ఎకరాలైనా మార్చి 2022 నాటికి 40,888 ఎకరాలే సాధ్యమైందని.. 3.43 లక్షల ఎకరాలకు డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్ రెడీ కాలేదని, మరో 14.83 లక్షల ఎకరాలకు పంపిణీ వ్యవస్థ సమకూరినా నీరు అందలేదని వివరించింది.

కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా విద్యుత్ వినియోగం తక్కువేనని, వార్షిక బిల్లులు తక్కువే వస్తాయని ఒక్కో యూనిట్ ధరను సగానికిపైగా తగ్గించి గత ప్రభుత్వం డీపీఆర్‌లో చూపించింది. ప్రాజెక్టు అనుమతికి సమర్పించే కాగ్‌ నివేదికలో వాస్తవ ఖర్చు, వార్షిక నిర్వహణకయ్యే ఖర్చును తక్కువగా చూపి అధిక ప్రయోజనాలు వస్తాయని నమ్మించిందని కాగ్ వివరించింది.



Next Story

Most Viewed